రష్యా ఉక్రెయిన్ యుద్ధం కారణంగా ఆహార పదార్ధాలు లేక అల్లాడుతున్న దేశాలకు ఆహార ధాన్యాలు సరఫరా చేసేందుకు భారత్ సిద్ధంగా ఉందని ప్రధాని నరేంద్రమోడీ ప్రకటించారు. ప్రపంచ వాణిజ్య సంస్థ అనుమతిస్తే ఆహార ధాన్యాలు సరఫరా చేసేందుకు భారత్ సిద్ధంగా ఉందని వెల్లడించారు.
ప్రపంచంలోని కొన్ని దేశాలు ఎదుర్కొంటున్న ఆహార కొరతపై అమెరికా అధ్యక్షుడు జో బిడెన్తో చర్చించినట్లు కూడా ప్రధాని నరేంద్ర మోదీ మంగళవారం తెలిపారు. “ఉక్రెయిన్లో యుద్ధం కారణంగా ప్రపంచంలోని వివిధ ప్రాంతాలలో ఆహార నిల్వలు తగ్గిపోతున్నాయి. ప్రపంచం ఇప్పుడు కొత్త సమస్యను ఎదుర్కొంటోంది. ప్రపంచంలోని ఆహార నిల్వలు ఖాళీ అవుతాయి. నేను అమెరికా అధ్యక్షుడితో మాట్లాడుతున్నాను ఆయన కూడా ఈ అంశాన్ని ప్రపంచ వాణిజ్య సంస్థ ఎదుట ప్రస్తావిస్తారు. ప్రపంచ వాణిజ్య సంస్థ అనుమతి ఇస్తే, రేపటి నుండి ప్రపంచానికి ఆహార నిల్వలను సరఫరా చేయడానికి భారతదేశం సిద్ధంగా ఉంది ”అని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు.
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ మంగళవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా గుజరాత్ లోని గాంధీ నగర్ లో “శ్రీ అన్నపూర్ణ ధామ్” హాస్టల్, విద్యా సముదాయాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారతదేశం ఇప్పటికే దేశంలోని ప్రజలకు తగినంత ఆహార నిల్వలను కలిగి ఉందని, “మన రైతులు ప్రపంచానికి ఆహారం ఇవ్వడానికి కూడా సిద్ధంగా ఉన్నారు” అని ఆయన అన్నారు.
అయితే, మనం ప్రపంచ చట్టాల ప్రకారం పని చేయాలి, కాబట్టి WTO ఎప్పుడు అనుమతి ఇస్తుందో నాకు తెలియదు. అనుమతి వస్తే ప్రపంచానికి ఆహారాన్ని సరఫరా చేయగలము అని ప్రధాని మోడీ అన్నారు. పాటిదార్ సంఘం అన్నపూర్ణ ధామ్ లను ఏర్పాటు చేసి అవసరమైన వారికి విద్య, పోషకాహారం అందిస్తున్నదని ఆయన తెలిపారు. ప్రభుత్వ ఆసుపత్రులలో కేంద్ర ప్రభుత్వం ఆరోగ్య ధామ్ లను ప్రవేశ పెడుతున్నదని, దీని ద్వారా రోగులకు ఉచిత డయాలసిస్ సౌకర్యం లభిస్తుందని ఆయన అన్నారు.