ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ను ఆకస్మికంగా బదిలీ చేయడం చర్చనీయాంశం అయింది. ఆరుగురు కొత్త గవర్నర్ లను నియమించడం, ఏడుగురికి స్థానచలనం కల్పించడం సాధారణ పరిపాలనా చర్యగా కనిపిస్తున్నా కూడా బీజేపీ ఆలోచనలకి అత్యంత విధేయుడైన సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి అబ్దుల్ నజీర్ను ఏపికి గవర్నర్ గా పంపడం ఇప్పుడు ఆసక్తి కలిగిస్తున్నది.
రాష్ట్ర గవర్నర్గా ఇంతకాలం ఉన్న బిశ్వభూషన్ ముఖ్యమంత్రి జగన్ తో మంచి సంబంధాలను నెరిపారు. జగన్ అనేక అక్రమాలకు, రాజ్యాంగ ఉల్లంఘనలకు పాల్పడుతున్నారని ప్రతిపక్షాలు ఎన్నోసార్లు గవర్నర్కు ఫిర్యాదు చేసినా, ఆయన ఏనాడూ వాటిని పట్టించుకోలేదు.
రాష్ట్ర ప్రభుత్వం ఏమి చేసినా గవర్నర్ చూస్తూండిపోయారని, రాజ్యాంగ ఉల్లంఘనలకు, పౌరుల ప్రాధమిక హక్కులకు భంగం కలిగినా, ఒక రాజకీయపార్టీ కార్యాలయంపై జగన్ పార్టీ నేతలు దాడులు చేసినా ఆయన పట్టించుకోలేదని, ఇవే కాకుండా చాలా విషయాల్లోనూ గవర్నర్ రాష్ట్ర ప్రభుత్వాన్ని గుడ్డిగా బలపరిచారనే అభిప్రాయాలు ఉన్నాయి. అంతే కాకుండా బిశ్వభూషణ్ హరిచందన్ కేంద్ర పెద్దలకు అన్ని విషయాలు చెప్పడం లేదని కూడా చాలా కాలంగా ఆరోపణలు వినిపిస్తున్నాయి.
ఈ దశలో ఆయనను బదిలీ చేయడం కొన్ని వర్గాలను ఆనంద పరిచింది. ఇటీవల కాలంలో కేంద్రంలోని బిజెపి పెద్దలకు, రాష్ట్ర ప్రభుత్వ పెద్దలకు చెడిందనే వార్తల నేపథ్యంలో ఈ బదిలీ ఆసక్తిని రేకెత్తిస్తోంది. ముఖ్యమంత్రి జగన్ కు కేంద్రం నుంచి ఆశించిన సహకారం లభించడం లేదని, ఆయనను ఇరుకున పెట్టడానికి కేంద్ర పెద్దలు ప్రయత్నిస్తూన్నారని కొద్ది రోజులుగా గుసగుసలు వినిపిస్తున్నాయి.
రాష్ట్రంలో జగన్ పాపులారిటీ దారుణంగా పడిపోయిందని చాలా సర్వేలు సూచిస్తున్న నేపథ్యంలో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఆయన నుంచి దూరం జరుగుతున్నట్లు కూడా చెబుతున్నారు. జగన్ మళ్లీ గెలుస్తారని భావించినంత కాలం ఆయనపై ఈగ వాలకుండా చూసిన బీజేపీ ఇప్పుడు ప్రజల అభిప్రాయం మారడంతో తన అభిప్రాయం కూడా మార్చుకుందని అంటున్నారు.
ఈ కారణంగానే జగన్ కు ఇక నుంచి సపోర్టు చేయరాదని నిర్ణయించుకున్నారని, అందులో భాగంగానే తమకు పూర్తి నమ్మకస్తుడైన వ్యక్తిని గవర్నర్ గా పంపించారని అంటున్నారు. రాష్ట్రంలో జరుగుతున్న రాజ్యాంగ ఉల్లంఘనలపై కొత్త గవర్నర్ ఎలాంటి చర్యలు తీసుకుంటారో అనేది ఆసక్తికరంగా మారింది.