రాష్ట్ర గవర్నర్ పై మంత్రి తలసాని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. గవర్నర్ రాజ్యాంగ పరమైన హోదా ఉన్నవారు పరిమితులకు లోబడి మాట్లాడాలని హితవు పలికారు. గవర్నర్ వ్యవస్థ ఉండకూడదని ఎప్పటి నుండో ఉన్న డిమాండ్ అని ఆయన అన్నారు. గవర్నర్ కు ఒక పరిధి ఉందని, ఆ పరిధిని భారత రాజ్యాంగం నిర్ణయించిందని అన్నారు.
ప్రభుత్వంపై ఇష్టం ఉన్నట్లు మాట్లాడితే బాధ్యత రాహిత్యం అవుతుందన్నారు. గవర్నర్ మీడియాతో రాజకీయాలు మాట్లాడకూడదని… గతంలో గవర్నర్లను గౌరవించామని గవర్నర్ లను ఎలా గౌరవించాలో తమకు తెలుసునని మంత్రి వ్యాఖ్యానించారు. గవర్నర్ ఇష్టం వచ్చినట్లు మాట్లాడడం సరైంది కాదన్నారు.
ప్రధాని, హోంమంత్రిని కలిసిన తర్వాత మీడియాతో మాట్లాడే అవసరం లేదన్నారు. ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు అన్ని విషయాలు మీడియా తో మాట్లాడలేనని తమకు పరిధి ఉంటుందని చెప్పిన విషయాన్ని మంత్రి గుర్తు చేశారు. నాడు ఎన్టీఆర్ ను గద్దె దించేందుకు అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం గవర్నర్ ను వాడుకున్నదని గుర్తు చేశారు.
రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు ప్రతిపక్ష పార్టీలకు నోటికి బట్ట లేదని విమర్శించారు. వరి ధాన్యం మీద పోరాటం చేస్తున్నామని… రైతులకు అవసరమైన విధంగా మాట్లాడాలని కోరారు. తెలంగాణ రాష్ట్రంలో ఇలాంటి ప్రతిపక్షాలు ఉండడం దురదృష్టకరమన్నారు.
ధాన్యం ఎందుకు కొన్నారో భాజపా నాయకులు చెప్పాలని కోరారు. తెలంగాణ ప్రజలు నూకలు తినాలి అని కేంద్ర మంత్రి అనడం బాధ్యతారాహిత్యమని తలసాని అన్నారు. 24 గంటల విద్యుత్ సరఫరా మన రాష్ట్రంలో ఉందని… వాళ్లు పాలించే రాష్ట్రాల్లో లేదని అందుకే వాళ్లకు ఈర్ష్య అన్నారు. వ్యవస్థలను పని చేయనియాలని కానీ వ్యవస్థ పక్కదారి పట్టించవద్దని మంత్రి సూచించారు.