కడప నగరంలో అధికార యంత్రాంగం చెత్తను సక్రమంగా ఎత్తడం లేదని సిపిఎం కడప నగర కార్యదర్శి ఎ.రామమోహన్ విమర్శించారు. ఆదివారం నాడు కడప నగరం నాగరాజు పేట లో ఉన్న శ్రీహరి రావు వీధిలో పేరుకుపోయిన చెత్త ప్రాంతాన్ని సిపిఎం ప్రతినిధి బృందం పరిశీలించారు. ఈ సందర్భంగా రామ్మోహన్ మాట్లాడుతూ కడప నగరంలో కొన్ని ప్రాంతాల్లో చెత్తను ఐదు రోజుల నుండి పది రోజుల వరకు ఎత్తకుండా వదిలేస్తున్నారని ఆయన తెలిపారు. దీని కారణంగా రోడ్లమీద చెత్త వేయాల్సి వస్తుందన్నారు.
రోడ్లమీద వేసిన చెత్తను కూడా పది రోజులు గడిచినా అధికార యంత్రాంగం ఎత్తివేయడంలో శ్రద్ధ చూపడం లేదన్నారు. దీని కారణంగా నగర ప్రజానీకం వివిధ రకాల జబ్బులకు గురవుతున్నారని ఆయన తెలిపారు. వర్షాకాలమైనందున మురుగునీరు ఒకవైపు, చెత్త మరొకవైపు పేరుకుపోయి మురికి కంపు వస్తోందన్నారు. దీని కారణంగా ప్రజలు అనేకమంది మలేరియా, టైఫాయిడ్ లాంటి విషజ్వరాలకు గురవుతున్నారని ఆయన అన్నారు. అటు వేలాది రూపాయలు హాస్పిటల్ కు ఖర్చు పెట్టలేక ఇటు వైద్యం చేయించుకోలేక సామాన్య ప్రజలు అష్ట కష్టాలు పడుతున్నారని ఆయన అన్నారు.
దీన్ని నివారించేందుకు కడప నగర పాలక యంత్రాంగం తక్షణం చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. చెత్తను సక్రమంగా ఎత్తకపోతే పన్ను ఎందుకు కట్టాలని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారన్నారు. తక్షణమే కడప నగరంలో వసూలు చేస్తున్న చెత్త పన్నును రద్దు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. లేని పక్షంలో నవంబర్ ఒకటో తేదీ నుంచి ఈ ఆందోళనను మరింత తీవ్రతరం చేస్తామని వారు హెచ్చరించారు. ఇంకా ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కమిటీ సభ్యుడు దస్తగిరి రెడ్డి, పార్టీ నగర కార్యదర్శివర్గసభ్యులు పి చంద్రారెడ్డి, నగర కమిటీ సభ్యులు పరుక్ హుస్సేన్, ఐద్వా నాయకురాలు రసూల్ బీ, గడ్డం శీను సురేష్ నాయక్, సురేంద్ర, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.