దళిత రిపోర్టర్ ను అవమానించిన అగ్రవర్ణానికి చెందిన వ్యక్తిపై ఎస్సీ,ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు అయినా అరెస్టు చేయకపోవడం ఏంటని, అగ్రవర్ణాలకు చట్టాలు చుట్టాలా అని మాలల చైతన్య సమితి రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షుడు మూలే కేశవులు సంబంధిత అధికారులను ప్రశ్నించారు.
గురువారం నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట లో వారు విలేకరుల సమావేశంలో మాట్లాడారు. కొల్లాపూర్ నియోజక వర్గ పట్టణ కేంద్రానికి చెందిన సాయి కృప హాస్పిటల్ యజమాని కొండ శ్రీనివాసులు శెట్టిని వెంటనే అరెస్టు చేయాలని జిల్లా ఎస్పీని డిమాండ్ చేశారు.
దళిత రిపోర్టర్ అయిన అవుట రాజశేఖర్ పై ఈ నెల 3వ తేదీన రిపోర్టర్ వృత్తిని వ్యభిచారంతో పోలుస్తూ అవమాన పరుస్తూ శ్రీనివాసులు శెట్టి కామెంట్ చేశాడని ఆయన అన్నారు. అంతే కాదు చెప్పుతో కొట్టి పడుకో బెట్టి నోట్లో ఊస్తారు… వాడూ, వీడు ఒక నీచుడు అంటూ ఉద్దేశపూర్వకంగా కులం పేరుతో దూషించారని ఆయన తెలిపారు.
రాజశేఖర్ దళితుడు అయినందుకే అవమానకరమైన అనుచిత వ్యాఖ్యలు చేస్తూ అగ్రకుల అహంకారాన్ని చూపించారన్నారు. ఇదివరకు తన హాస్పిటల్ తో పాటు అక్రమంగా అవినీతిగా నడుపుతున్న లక్కీ డ్రా స్కీం లపై, ఇల్లీగల్ కట్టడాలపై వార్తలు రాసినందుకు జీర్ణించుకోలేక కుట్రలు చేశారన్నారు.
ఉద్దేశపూర్వకంగా తప్పుడు ఫిర్యాదులతో రాజశేఖర్ పై అక్రమ కేసు బనాయించి జైలుకు పపించారన్నారు. అంతటితో ఆగకుండా కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారన్నారు. కొండ శ్రీనివాసులు పై ఆధారాలతో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు అయిందని. కేసు అయ్యి పది రోజులు అవుతున్నా సంబంధిత అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారన్నారు.
కొండ శ్రీనివాసులు శెట్టికి స్టేషన్ బెయిల్ ఇవ్వకుండా జైల్ కు పంపించాలన్నారు. ఇంత వరకు పోలీసులు అరెస్టు చేయకుండా చట్టాలను నీరుకారుస్తున్నారని ఆయన తెలిపారు. వెంటనే అరెస్టు చేయకపోతే దళిత సంఘాల ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమం చేపడతామని సంబంధిత అధికారులను వారు హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో అచ్చంపేట తాలూకా అధ్యక్షులు పిల్లి రవికుమార్, గౌరవాధ్యక్షులు బాలచందర్, ప్రధాన కార్యదర్శి మండల సుధాకర్, ఉపాధ్యక్షులు తంగిరాల కేశవులు,సీనియర్ నాయకులు వేదవ్యాస్ వెంకటేష్, సాలయ్య,రాజు,అశోక్,శివ శంకర్,వినోద్,నరేష్,మల్లేష్ తదితరులు పాల్గొన్నారు.