పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ విస్తరణ పనులపై తెలంగాణ ప్రభుత్వం నుంచి అనుమతి తీసుకోవాల్సిన అవసరం లేదని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ అన్నారు. తెలంగాణ ప్రభుత్వం అభ్యంతరం వ్యక్తం చేస్తుండటాన్ని ఏపీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ప్రశ్నించారు. తెలంగాణలోని కొందరు రాజకీయనాయకులు కేవలం అంశాన్ని రాజకీయం చేయడానికే మాట్లాడుతున్నారని మంత్రి విమర్శించారు.
తమకు రావాల్సిన కృష్ణా నదీ జలాల వాటాను మాత్రమే తాము తీసుకుంటున్నామని మంత్రి వివరించారు. సముద్రంలో కలిసిపోయే మిగులు జలాలను తీసుకుంటే తెలంగాణ రాష్ట్రానికి జరిగే నష్టమేంటో తమకు అర్థం కావడం లేదని అన్నారు. ఈ విషయంలో తెలంగాణ నుంచి వస్తున్న అభ్యంతరాలను పట్టించుకోవాల్సిన అవసరం లేదని, తమ నిర్ణయం తమదేనని, తెలంగాణ వాళ్ల నిర్ణయం వాళ్లదేనని స్పష్టం చేశారు.