వైసీపీ ప్రభుత్వం ఉద్యోగులంటే లెక్కలేకుండా వ్యవహరిస్తోందని టీడీపీ శాసనసభ్యుడు అనగాని సత్య ప్రసాద్అన్నారు. ముఖ్యమంత్రి జగన్ రెడ్డి తన సలహాదారులకు ఇచ్చిన ప్రాధాన్యత ప్రభుత్వ ఉద్యోగులకు ఇవ్వడం లేదని ఆయన ఆక్షేపించారు.
సలహాదారులకు లక్షల్లో జీతాలు ఇస్తూ, కోట్లాది రూపాయల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని, ఉన్న సలహాదారులు చాలక మళ్ళీ అదనంగా ప్రైవేట్ సలహాదారులను నియమించాల్సిన అవసరం ఏంటని ఆయన ప్రశ్నించారు. పనికిరాని సలహాదారులకు కోట్లాది రూపాయలు ఇస్తున్నారు కానీ ప్రభుత్వానికి, ప్రజలకు వారధిగా ఉన్న ఉద్యోగుల డిమాండ్లను పరిష్కరించరా? అని ఆయన ప్రశ్నించారు.
కరోనా సమయంలో సలహాదారులు ఇళ్లల్లో కూర్చుంటే ఉద్యోగులు మాత్రం తమ ప్రాణాలు సైతం పణంగా పెట్టి పని చేశారని ఆయన గుర్తు చేశారు. రాష్ట్ర విభజన తర్వాత రాష్ట్రానికి తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ తెలుగుదేశం ప్రభుత్వం 43శాతం ఫిట్ మెంట్ తో పిఆర్ సి ఇచ్చారు.
చంద్రబాబు నాయుడు పాలనలో 62 జీవోలనిచ్చి ఉద్యోగుల సంక్షేమానికి బాటలు వేస్తే నేడు జగన్ నాలుగు జీవోలతో ఆ సంక్షేమానికి బీటలు వాటిల్లేలా వ్యవరించారని ఆయన తెలిపారు. ఉద్యోగుల జీతాల్లో కోత కోయడమేగాక వారినుంచి రివర్స్ లో బకాయిలు రికవరీ చేసేందుకు సిద్ధం కావడం దారుణం.బప్రభుత్వానికి, ఉద్యోగులపై ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తన వైఖరిని మార్చుకోవాలి. ఉద్యోగుల సంక్షేమానికి తూట్లు పోడుస్తున్న నాలుగు జీవోలను రద్దు చేయాలి అని ఆయన డిమాండ్ చేశారు.