కడప NJ జ్యూవెలర్స్ చోరీ కేసు ఛేదించిన పోలీసులు కడప నగరంలో సంచలనం సృష్టించిన బంగారు దుకాణం దొంగతనం కేసును పోలీసులు ఛేదించారు. నిందితుల నుంచి మొత్తం రూ.26 లక్షల విలువైన బంగారు, వెండి ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. జిల్లా ఎస్పీ కె.కె.ఎన్ అన్బురాజన్ ఈ విషయాలను నేడు మీడియా సమావేశంలో వెల్లడించారు.
ఈ నెల 13 వ తేదీన NJ జ్యూవెలర్స్ దుకాణంలో గ్రిల్ కిటికిని కట్ చేసి 466 గ్రాముల బంగారు ఆభరణాలు, 5.5 కేజీల వెండిని ఎవరో అపహరించారు. ఘటన జరిగిన వెంటనే సిసి కెమెరాల ఆధారంగా ప్రత్యేక బృందం ద్వారా పోలీసులు విచారణ చేపట్టారు.
పెనగలూరు కి చెందిన చప్పిడి మణి అలియాస్ ఇమ్రాన్ (29) ఈ నేరానికి పాల్పడ్డట్టు పోలీసులు గుర్తించారు. వెంటనే అతడిని అదుపులోకి తీసుకుని వివరాలు రాబట్టారు. పట్టుబడ్డ నిందితుని వద్ద నుండి పోయిన సొమ్ము మొత్తం 466 గ్రాముల బంగారు ఆభరణాలు, 5.5 కేజీల వెండి ఆభరణాలు, దొంగతనానికి ఉపయోగించిన సామగ్రి, ద్విచక్రవాహనం లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
పట్టుబడ్డ బంగారు వెండి ఆభరణాల విలువ 25.50 లక్షల రూపాయలు ఉంటుందని జిల్లా ఎస్పీతెలిపారు. కేసును ఛేదించి చోరీ సొత్తు రికవరీ కి కడప డి.ఎస్.పి బి.వెంకటశివారెడ్డి ఆధ్వర్యంలో కృషి చేసిన చిన్నచౌక్ సి.ఐ అశోక్ రెడ్డి, అర్బన్ సిఐ మహమ్మద్ అలీ తో పాటు, ఎస్సై రాఘవేంద్ర రెడ్డి, తులసినాగప్రసాద్, పెండ్లిమర్రి ఎస్.ఐ రాజరాజేశ్వర రెడ్డి, ఖాజీపేట ఏ.ఎస్.ఐ శ్రీనివాసులు, హెడ్ కానిస్టేబుల్ ప్రసాద్, కానిస్టేబుళ్లు రాజేష్, బాషా, నారాయణరెడ్డి, సుబ్బారాయుడు, హుస్సేన్, నాగరాజు, సాయి లను ఆయన ప్రత్యేకంగా అభినందించి రివార్డులు అందచేశారు.