తమిళనాడులోని కృష్ణగిరి జిల్లాలో యూట్యూబ్ చూసి భార్యకు ప్రసవం చేశాడు ఓ భర్త. మగశిశువుకు జన్మనిచ్చి ఆ ఇల్లాలు కన్నుమూసింది. ఈ ఘటనపై జిల్లా కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేయడంతో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. పోచంపల్లి సమీపంలోని పులియాంపట్టి గ్రామానికి చెందిన లోకనాయకికి ధర్మపురి జిల్లాలోని అనుమంతపురం గ్రామవాసి మాదేశ్తో 2021లో వివాహం జరిగింది. మాదేశ్ సేంద్రియ వ్యవసాయంతో జీవనం సాగిస్తున్నాడు.
భార్య ఇటీవల గర్భం దాల్చగా సేంద్రియ పద్ధతిలాగే ఆమెకు కూడా ఎలాంటి మందులు లేకుండా సహజ పద్ధతిలో ప్రసవం జరగాలని భావించాడు.ఆ మేరకు లోకనాయకికి వైద్యపరీక్షలు సైతం చేయించలేదు. స్థానిక ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు ఆమె పేరును ప్రభుత్వ రికార్డుల్లో నమోదు చేసుకోవాలని సూచించినా.. మాదేశ్ ససేమిరా అన్నాడు.
ప్రసవ సమయంలో ప్రభుత్వం అందించే వ్యాక్సిన్లతోపాటు పౌష్టికాహారాన్నీ నిరాకరించాడు. తనే ఆమెకు గింజలు, ఆకుకూరలు ఆహారంగా అందించేవాడు. ఈ క్రమంలో ఇంట్లో ఉన్న లోకనాయకికి ప్రసవ నొప్పులు మొదలయ్యాయి.
మాదేశ్ తన ఫోనులో యూట్యూబ్ చూస్తూ భార్యకు ప్రసవమయ్యేలా చేశాడు. సరైన రీతిలో వైద్యం అందకపోవడం వల్ల మగశిశువుకు జన్మనిచ్చిన వెంటనే ఆమె అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయింది.ఇక తప్పదని కున్నియార్లోని ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో లోకనాయకి మరణించింది. పోలీసులు ఆమె మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం పోచంపల్లి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ప్రభుత్వ వైద్యురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు.