వాగులు, వంకల్లోని ఇసుకను కూడా అమ్ముకోవచ్చు అంటూ వాల్టా చట్టానికి సవరణ చేయడం దారుణమైన విషయమని బిజెపి రాష్ట్ర ప్రధానకార్యదర్శి యస్.విష్ణువర్ధన్ రెడ్డి అన్నారు. ప్రభుత్వ పెద్దలకు చెందిన జయప్రకాష్ వెంచర్సు కంపెనీకి దోచిపెట్టేలా నిర్ణయం తీసుకోవడాన్ని బిజెపి ఆంధ్రప్రదేశ్ చాలా తీవ్రంగా ఖండిస్తోందని ఆయన తెలిపారు. ‘‘మీరు ఎలాగూ పేదవారికి ఇల్లు కట్టిచ్చే పరిస్థితి లేదు, కనీసం వాళ్ళ రెక్కల కష్టంతో కట్టుకుంటున్నా ప్రభుత్వం సహకరించకపోతే ఏలా?’’ అని ఆయన ప్రశ్నించారు. ఇప్పటికే ఒక వైపు పెరిగిన ఇసుక, సిమెంటు, ఐరన్, స్టీలు ధరలతో మధ్య తరగతి, పేదవారు సతమతమవుతుంటే ఇప్పుడు వాగులు, వంకల్లోని ఇసుకను కూడా అమ్ముకోవచ్చు అంటూ వాల్టా చట్టానికి సవరణ తీసుకురావడం తద్వారా జయప్రకాశ్ వెంచర్స్ కు మేలు చేయడం అన్యాయమని ఆయన అన్నారు. అందుకు సంబంధించిన గెజిట్ నోట్ విడుదల చేయడాన్ని ఖండిస్తున్నామని, వెంటనే ఈ చట్ట సవరణను ఉపసంహరించుకోవాలని బిజెపి డిమాండ్ చేస్తోందని విష్ణువర్ధన్ రెడ్డి తెలిపారు.