రాష్ట్ర రాజధాని అమరావతి నుంచి మార్చరాదని డిమాండ్ చేస్తూ గుంటూరులో అమరావతి పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో మహిళా జేఏసీ భారీ ర్యాలీ నిర్వహించింది. వేలాది మంది మహిళలు రోడ్డుపైకి వచ్చి అమరావతిని రాజధానిగా కొనసాగించాలని డిమాండ్ చేశారు.
అమరావతిని మార్చడం వల్ల రాష్ట్రానికి అర్ధికంగా ఎంతో భారం పడుతుందని అసలే కొత్త రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ కు మరింత అన్యాయం జరుగుతుందని వారన్నారు. మహిళలు అమరావతి లోనే రాజధానిని కొనసాగించాలని నినాదాలు చేస్తూ ర్యాలీగా రావడంతో ట్రాఫిక్ స్తంభించింది. చంటి పిల్లలను కూడా తీసుకుని మహిళలు రోడ్డుపైకి వచ్చారు. రాజధానిని అమరావతిలోనే కొనసాగించాలనే డిమాండ్ ను తాము పార్టీలకు అతీతంగా చేస్తున్నామని, తమకు పార్టీలతో సంబంధం లేదని వారన్నారు.
పార్టీ వద్దూ, ప్రాంతం పేరూ వద్దు అమరావతి ముద్దు అంటే వారు నినాదాలు చేశారు. అమరావతి నుంచి హైకోర్టును తరలించడం కూడా అనాలోచిత నిర్ణయమని మహిళా న్యాయవాదుల అన్నారు. తక్షణమే రాజధాని తరలింపు నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని మహిళా జేఏసీ డిమాండ్ చేసింది.