తెలంగాణ బీజేపీ వ్యవహరాల ఇంచార్జి సునీల్ బన్సల్ పిలుపు
పార్లమెంట్ సెగ్మెంట్లలోని అసెంబ్లీ స్థానాలలో గెలుపు కోసం ప్రతి ఒక్కరు కష్టపడి పని చేయాలని బీజేపీ తెలంగాణ వ్యవహారాల ఇంచార్జి, జాతీయ ప్రధాన కార్యదర్శి సునీల్ బన్సల్ అన్నారు. కామారెడ్డి మున్సిపల్ పరిధిలోని దేవునిపల్లి లక్ష్మీదేవి గార్డెన్ లో పార్లమెంట్ ప్రవాస యోజన కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన ఆదిలాబాద్, పెద్దపల్లి, మెదక్, జహీరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గాల నాయకులతో క్లస్టర్ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న సందర్బంగా సునీల్ బన్సల్ మాట్లాడుతూ..రాబోయే ఎన్నికల్లో గెలుపు లక్ష్యాలపై దిశానిర్దేశం చేశారు.
ఎట్టి పరిస్థితుల్లో నాలుగు పార్లమెంట్ నియోజకవర్గాల పరిధిలో బీజేపీ జెండా ఎగురవేసేలా కృషి చేయాలన్నారు. బీఆర్ఎస్ పాలనలో ప్రజలకు జరుగుతున్న అన్యాయాలు, ప్రభుత్వ అక్రమాలను పోరాడాలని, క్షేత్రస్థాయిలో ప్రజలలో ఉంటూ ప్రజలకు ప్రభుత్వ అక్రమాలను వివరించాలన్నారు. తెలంగాణలో పార్టీ వ్యవహారాలన్నీ తాము నిశితంగా గమనిస్తున్నామని పేర్కొన్నారు. కష్టపడి పనిచేస్తే గెలుపు తథ్యమని తెలిపారు. ఈ సమావేశంలో బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రేమేందర్ రెడ్డి, ఉపాధ్యక్షులు మహిపాల్ రెడ్డి, దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు, బీజేపీ జిల్లా అధ్యక్షురాలు అరుణ తార, కామారెడ్డి అసెంబ్లీ ఇంచార్జి కాటిపల్లి వెంకట రమణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.