తెలంగాణలో రాజన్న రాజ్యం రావాలన్నదే తన కోరిక అని వై ఎస్ రాజశేఖర్ రెడ్డి కుమార్తె, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి సొంత చెల్లెలు అయిన ‘జగన్న బాణం’ వై ఎస్ షర్మిలారెడ్డి తెలిపారు.
తెలంగాణలోని వైఎస్సార్ అభిమానులు, కార్యకర్తలు, అనుచరులతో వైఎస్ షర్మిలారెడ్డి నేడు ఆత్మీయ సమావేశం నిర్వహించారు. లోటస్ పాండ్ లో మొదట నల్గొండ జిల్లాకు చెందిన కీలక నేతలతో షర్మిలారెడ్డి సమావేశమయ్యారు.
ఈ సందర్భంగా ఆమె కార్యకర్తలు, నేతలతో మాట్లాడుతూ వై ఎస్ రాజశేఖరరెడ్డిని అభిమానించే ప్రతి వ్యక్తికి ఆయన కుమార్తెగా శిరసు వంచి చేతులు జోడించి నమస్కరిస్తున్నానని షర్మిలా రెడ్డి అన్నారు.
వైఎస్సార్ లేని లోటు తెలంగాణలో ఉందని, అందుకే తెలంగాణ రాష్ట్రంలో రాజన్న రాజ్యం రావాలన్నదే తన కోరిక అని ఆమె అన్నారు.
ప్రతి పేదవాడికి ఒక పక్కా ఇల్లు ఉండాలని, ప్రతి పేద విద్యార్థి గొప్ప చదువులు చదవాలని, పెద్ద పెద్ద ఉద్యోగాలు చేయాలనేదే వైఎస్ రాజశేఖరరెడ్డి కోరిక అని ఆమె అన్నారు.
పేదరికం అన్నది ఒక శాపమని.. దాన్ని రూపుమాపాలని నాన్నగారు శ్రమించారు. పేదవాడు అనారోగ్యంతో అప్పులు కాకూడదని.. చనిపోకూడదని ఆరోగ్య శ్రీ తెచ్చారు.. ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయి. అవన్నీ మీకు ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు.
అందుకే రాజన్న రాజ్యం రావాలని నా కోరిక అని షర్మిలారెడ్డి అన్నారు. ఈ ప్రక్రియలోనే.. ఇందులో భాగంగానే ఇవాళ ఈ ఆత్మీయ సమావేశాన్ని నిర్వహించాం. మీకు (అభిమానులు, అనుచరులు) తెలిసినంతగా నాకు తెలియదు.
మీ.. మీ స్వస్థలాల్లో మీరేం చేశారు..? మీ సలహాలు, మీ సూచనలు ఇవ్వండి. మీరు చెప్పే విషయాలు వినడానికి.. అర్థం చేసుకోవడానికే నేను వచ్చాను.. వెల్ కమ్..’ అని తన ప్రసంగాన్ని షర్మిల ముగించారు.