నందిగ్రామ్ లో పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీపై జరిగిన దాడిని తీవ్రంగా నిరసిస్తూ బిజెపి సీనియర్ నాయకుడుగా చాలా కాలం పాటు కొనసాగిన యశ్వంత్ సిన్హా నేడు తృణమూల్ కాంగ్రెస్ లో చేరారు.
నందిగ్రామ్ లో నామినేషన్ దాఖలు చేసేందుకు నాలుగు రోజుల కిందట వెళ్లిన మమతా బెనర్జీ ని కొందరు గుర్తు తెలియని వ్యక్తులు కిందికి తోసేశారు.
దాంతో ఆమె కాలు బెణికింది. కోల్ కతాలోని ఎస్ ఎస్ కె ఎం ఆసుపత్రిలో ఆమెను చికిత్సకోసం చేర్చారు. రెండు రోజుల చికిత్స తర్వాత ఆమె ఆసుపత్రి నుంచి బయటకు వచ్చారు.
మరి కొద్ది రోజులు విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు చెప్పినా ఆమె వినలేదు. జరిగిన ఈ పరిణామాలను గమనించిన సీనియర్ నాయకుడు యశ్వంత్ సిన్హా మనసు ఉండబట్ట లేక మమతా బెనర్జీకి తన పూర్తి మద్దతు ప్రకటించారు.
అంతే కాకుండా ఆయన తృణమూల్ కాంగ్రెస్ లో చేరారు.
అటల్ బిహారి వాజ్ పేయి నేతృతంలోని బిజెపి అందరిని కలుపుకుని వెళ్లేందుకు, ఏకాభిప్రాయాన్ని సాధించేందుకు పాటు పడితే, ఈనాటి బిజెపి మిగిలిన పార్టీలను చిదిమేయడం, ప్రతిపక్షాలను నాశనం చేయడంపైనే దృష్టి సారించి ఉందని యశ్వంత్ సిన్హా తెలిపారు.