ఎన్నికల ముందు వైసిపి నాయకులు బీసీ డిక్లరేషన్, బీసీ సబ్ ప్లాన్ అంటూ ప్రచారం చేసి అధికారంలోకి రాగానే రిజర్వేషన్లు తగ్గించి వెన్నెముక విరిచేయడం బీసీలను నమ్మించి మోసం చేయడమేనని కడపజిల్లా రాజంపేట టీడీపీ నియోజకవర్గ ఇంచార్జ్ బత్యాల చంగల్ రాయుడు అన్నారు.
శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ గత తొమ్మిది నెలలుగా రాష్ట్ర ప్రభుత్వ నిర్లిప్తత, నిర్లక్ష్యం, ఉదాసీనత వల్లే 60.55 శాతం ఉండాల్సిన రిజర్వేషన్లలో 10 శాతం కోతపడిందని ఆయన అన్నారు. బీసీలకు ఉండాల్సిన 34 శాతం రిజర్వేషన్లు 24 శతానికే పరిమితం చేయడం వలన వేలాది మంది బీసీలకు రాజకీయ అవకాశాలు లేకుండా చేశారని ఆయన ధ్వజమెత్తారు.
ఇంత తీవ్ర సమస్యపై అఖిలపక్ష సమావేశం పిలవకుండా, బిసి సంఘాలను సంప్రదించకుండా ఏకపక్షంగా నిర్ణయం తీసుకోవడం సరైంది కాదని భత్యాల అన్నారు. 33 ఏళ్లుగా 27శాతం రిజర్వేషన్లు, 25 ఏళ్లుగా 34 శాతం రిజర్వేషన్లు పొందుతున్న లబ్ధిని తీసివేయడం బీసీ సాధికారతను దెబ్బతీస్తుందని, అన్ని రాజకీయ పార్టీలు బీసీ సంఘాల నాయకులతో సంప్రదింపులు జరిపి 34 శాతం రిజర్వేషన్లను కాపాడవలసిన బాధ్యత ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డిపై ఉందని ఆయన అన్నారు.
తక్షణమే స్పందించి చి 34 శాతం బీసీ రిజర్వేషన్ల పరిరక్షణకి రాష్ట్ర ప్రభుత్వం తరపున సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ వెంటనే వేయాల్సిందిగా డిమాండ్ చేస్తున్నామని ఆయన అన్నారు. ఇందుకు తమ పార్టీ తరుపున అన్ని రకాల మద్దతు ఇస్తామని భత్యాల తెలియజేసారు.
రాష్ట్ర జనాభాలో 50 శాతానికి పైగా ఉన్న బీసీల రాజకీయ, సామాజిక,ఆర్థిక ప్రగతికి తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి కృషి చేస్తోందని, బీసీల అభ్యున్నతే లక్ష్యంగా తెలుగుదేశం ప్రభుత్వం 1987లో బీసీలకు 27శాతం రిజర్వేషన్లు అమలులోకి తెచ్చిందని ఆయన అన్నారు. 33 ఏళ్లుగా క్షేత్రస్థాయి నుంచి బలహీనవర్గాల్లో నాయకత్వం పెంపొందించేందుకు, సామాజిక న్యాయం కోసం కృషి చేసిందని ఆయన అన్నారు. స్థానిక సంస్థల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు గత 26 ఏళ్ల నుంచి అమలులో ఉన్నాయని వై ఎస్ జగన్ ముఖ్యమంత్రి అయి వాటిని పణంగా పెట్టారని భత్యాల చంగల్ రాయుడు అన్నారు.