వారంతా ఒకే అపార్టుమెంటులో నివాసం ఉంటున్నారు. పిల్లలను తీసుకుని అక్షరాభ్యాసం చేయించడానికి 5 కుటుంబాలు ఓ మినీ బస్సు మాట్లాడుకుని బయలుదేరారు. బస్సు వెనక టైర్ పేలి బస్సు బోల్తాపడి అందరూ గాయాల పాలయ్యారు. కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండలం మల్లుపేట గ్రామ శివారులో ఈ ఘటన చోటు చేసుకుంది.
మినీ బస్సు బోల్తా పడి 5 కుటుంబాలకు చెందిన 20 మంది తీవ్ర గాయాలు పాలయ్యారు. వివరాల్లోకి వెళితే హైదరాబాద్ మూసాపేట్ కు చెందిన 5 కుటుంబాలు ఉదయం బాసర వెళ్ళడానికి ఓ మినీ బస్సు మాట్లాడుకుని బయలుదేరారు. కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండలం మల్లుపేట గ్రామ శివారుకు రాగానే బస్సు వెనక టైర్ పేలి బస్సు మూడు పల్టీలు కొట్టింది.
దాంతో డ్రైవర్ సహా బస్సులో ప్రయాణిస్తున్న 12 మంది పెద్దలు, 9 మంది చిన్నారులకు తీవ్రగాయాలయ్యాయి. సేమ నిర్మల ఆమె పిల్లలు నికిథ్, రేవంత్, నల్ల ఉమా శేఖర్, ఈశ్వర్, వీరి పిల్లలు అర్షిత్, చైత్ర, నల్ల యోగేష్, పద్మ.. వీరి పిల్లలు ప్రత్యూష, కిరణ్, యోగేష్ తల్లి శాంతి కుమారి, అత్తమ్మ లక్ష్మీ, బల్ల శివకుమార్, గీత ఆమె భర్త, పిల్లలు గాయపడ్డారు. వీరితో పాటు బస్సు డ్రైవర్ విజయ్ కుమార్ లకు తీవ్ర గాయాలయ్యాయి. వీరిని వెంటనే అంబులెన్స్ లో జిల్లా ఆస్పత్రికి తరలించి చికిత్సలు అందిస్తున్నారు.