అమరావతి రాజధాని గా ఉంచాలని 45 రోజు లు గా సాగుతున్న దీక్షా శిబిరాన్ని నరసరావుపేట పార్లమెంటు సభ్యుడు, వైసిపికి చెందిన లావు శ్రీ క్రిష్ణదేవరాయలు నేడు సందర్శించారు. దీక్షా శిబిరాన్ని వైసిపి నాయకుడు సందర్శించడం ఏమిటా అని అనుకుంటున్నారా? కరెక్టే. ఆయన ష్ట్రాటజీ ఏమిటో గానీ ఆయన నేడు దీక్షా శిబిరానికి వచ్చి రైతులతో మాట్లాడారు. ఇక్కడ భూములు ఇచ్చిన ఎవరికి అన్యాయం జరగదని ఆయన అన్నారు. ప్రభుత్వ కమిటీ వచ్చి మీ అందరి అభిప్రాయాలు తీసుకుంటుంది అని కూడా చెప్పారు.
రైతుల కష్టాలు మాకు తెలుసు. కమిటీ వచ్చినప్పుడు మీ అందరి అభిప్రాయాలు చెప్పండి. మీరు దూరంగా ఉండవద్దు..అంటూ ఆయన చెబుతుండగానే రాజధానికి మీరు అనుకూలమా కాదా ముందు చెప్పాలి అని మందడం గ్రామ రైతులు నిలదీశారు. దానికి ఆయన సమాధానం చెప్పలేదు కానీ అమరావతికి చెందిన రైతులు అందరూ ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోండి అని హితవు పలికారు. అమరావతి ని కొనసాగిస్తేనే మాతో చర్చకు రండి అని వైసీపీ ఎంపీకి రైతులు తేల్చిచెప్పారు.