గతంలో ప్రశాంతంగా ఉన్న వనపర్తిని ఫ్యాక్షన్ పర్తిగా మార్చారని, బీసీల ఆత్మగౌరవ సభ ద్వారా నియంత ఆగడాలకు చరమ గీతం పాడదామని బిసి పొలిటికల్ జేఏసీ చైర్మన్ రాచాల యుగంధర్ గౌడ్ జిల్లా ప్రజలకు పిలుపునిచ్చారు.
ఈనెల 9వ తేదీన వనపర్తి జిల్లా కేంద్రంలోని పాలిటెక్నిక్ కళాశాల మైదానంలో జరుగనున్న బీసీల ఆత్మగౌరవ సభను విజయవంతం చేయాలని కోరారు. వనపర్తి పాలిటెక్నిక్ కళాశాల ఆవరణలో అఖిల పక్ష రాజకీయ పార్టీల నాయకులతో కలిసి గోడపత్రికను ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో బీసీలపై దాడులు ఎక్కువయ్యాయని, ప్రశ్నించిన వారిపై అక్రమ కేసులు పెట్టించి వేధించడం ఫ్యాషన్ గా విమర్శించారు. బీసీలను కేవలం ఓటు బ్యాంకుగా వాడుకుంటూ జెండాలు మోసే కార్యకర్తలుగా, జిందాబాద్ లు కొట్టే కూలీలుగా చూస్తున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. వనపర్తి సభకు ముఖ్య అతిథిగా మాజీ మంత్రి ఈటల రాజేందర్ తో పాటు జిల్లాలోని అన్ని రాజకీయ పార్టీలు ముఖ్య నాయకులు, బిసి సంఘాల నాయకులు, బిసి కుల సంఘాల నాయకులు, ఉద్యోగులు, మేధావులు, విద్యార్థి సంఘాల నాయకులు హాజరవుతారని తెలిపారు.
ఈ కార్యక్రమంలో అఖిల పక్ష రాజకీయ పార్టీల నాయకులు గొల్ల వెంకటయ్య, శ్రీనివాస్ గౌడ్, బి.కృష్ణ, వనపర్తి మున్సిపాలిటీ ప్లోర్ లీడర్ బండారు రాధాకృష్ణ, కౌన్సిలర్ బ్రహ్మచారి, డి.నారాయణ, అక్కల రామన్ గౌడ్, నందిమల్ల అశోక్, సతీష్ యాదవ్, పెద్దమారు రాజు, ప్రవీణ్, బిసి పొలిటికల్ జేఏసీ నాయకులు అంజన్న యాదవ్, మహీందర్ నాయుడు, శేఖర్ గౌడ్,స్వామి నాయుడు, గంధం సుమన్ పాల్గొన్నారు.
పోలిశెట్టి బాలకృష్ణ, సీనియర్ విలేకరి, సత్యం న్యూస్ నెట్