తెలంగాణ యువత భవిషత్తుకు భరోసానిచ్చేది తెరాసానే అని ఆర్థిక మంత్రి హరీశ్ రావు అన్నారు. నీళ్లు, నిధులు, నియామకాలు అని ఏదైతే ఆనాడు ఉద్యమ నేతగా కేసీఆర్ చెప్పారో…అదే లక్ష్యంతో సీఎంగా కేసీఆర్ పని చేస్తున్నారని చెప్పారు. ఇవాళ హైదరాబాద్ లో ఆర్థిక మంత్రి హరీశ్ రావు సమక్షంలో హుజురాబాద్ నియోజకవర్గ విద్యార్థి సంఘం నేతలు తెరాసలో చేరారు.
టీవీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు పేర్నాక రమాకాంత్, పీడీఎస్ యూ జిల్లాఅధ్యక్షులు ఆక్కెనపల్లి శ్రీకాంత్, ఎస్.ఎఫ్.ఐ జిల్లా జాయింట్ సెక్రటరీ పోషంపల్లి రాకేష్, టీఎన్ఎస్ఎఫ్ జిల్లా ఉపాధ్యక్షులు ఎడ్ల అనిల్ తెరాసలో చేరారు. వారికి మంత్రి హరీశ్ రావు గులాబీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు.
మంత్రిగా పని చేసిన సమయంలో ఈటల రాజేందర్ తమను బాగా వేధించారని విద్యార్థి సంఘం నేతలు చెప్పారు. తమపై కేసులు పెట్టి కొట్టించారని, జైలుకు పంపారని, భయబ్రాంతులకు గురి చేశారని తెలిపారు. ఈటల తెరాస వీడి బీజేపీ లో చేరడంతో తాము తెరాసలో చేరి పని చేస్తామని మంత్రి హరీశ్ రావుకు చెప్పారు.
ప్రభుత్వం అండగా ఉంటుందన్న మంత్రి హరీశ్ రావు నీళ్లు నిధుల విషయంలో సీఎం కేసీఆర్ హామీ ఇచ్చిన రీతిలో లక్ష్యాలు సాధిస్తున్నారన్నారు. అదే రీతిలో నియామకాల విషయంలోను సీఎం కేసీఆర్ హామీ మేరకు ఇప్పటికే లక్ష 30 వేల ఉద్యోగాలు భర్తీ చేశారని చెప్పారు.
ఇవి కాక కొత్తగా 50 వేల ఉద్యోగాలకు త్వరలో నోటిఫికేషన్ జారీ చేయాలని సీఎం ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారని చెప్పారు. ప్రభుత్వ రంగంతో పాటు వేలకోట్ల పెట్టుబడులు ఆకర్షించడంలో తెలంగాణ రాష్ట్రం ముందుందని, కొత్త పరిశ్రమల స్థాపన జరుగుతోందన్నారు. ఈ ప్రయివేటు రంగంలోను రాష్ట్ర యువతకు లక్షలాది ఉద్యోగాలు వస్తాయని చెప్పారు.
ప్రభుత్వం చేస్తోన్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు ప్రజల్లోకి తీసుకోవాలని వారికి సూచించారు. పార్టీ అన్ని విషయాల్లో అండగా ఉంటుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్ బాల్క సుమన్, తెరాస నేత డాక్టర్ ఎర్రోళ్ల శ్రీనివాస్, కె. వాసుదేవరెడ్డి,మొలుగు పూర్ణ చందర్, టేకుల శ్రవణ్ తదితరులు పాల్గొన్నారు.