పోలీసులు వేధిస్తున్నారంటూ అధికార పార్టీ మునిసిపల్ కార్పొరేటర్ ఒకరు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డికి ఫిర్యాదు చేశారు. ఈ సంఘటన ప్రకాశం జిల్లా చీరాలలో జరిగింది. వైసీపీకి చెందిన చీరాల మున్సిపాలిటీ 5 వార్డు కౌన్సిలర్ సూరగాని లక్ష్మి ఈ మేరకు సీఎంకు లేఖ రాశారు. సూరగాని లక్ష్మి రాసిన లేఖ పూర్తి పాఠం ఇది:
అన్నా జగనన్నా!
నా పేరు సూరగాని లక్ష్మి, నేను వై ఎస్ ఆర్ సి పి అభ్యర్థిగా చీరాల మున్సిపల్ ఎన్నికలలో 5వ వార్డు కౌన్సిలర్ గా గెలిచాను. నా భర్త నరసింహారావు చీరాల పట్టణంలో కనక దుర్గా బార్ అండ్ రెస్టారెంట్ నిర్వహిస్తున్నారు. గత 17 సంవత్సరాలుగా వ్యాపారం చేస్తున్న మాకు ఇప్పటివరకు ఎలాంటి సమస్యలు రాలేదు.
గత డిసెంబరు 31 రాత్రి 11 గంటల 20 నిమిషాలకు చీరాల ఒకటో పట్టణ సీఐ రాజమోహన్ రెస్టారెంట్లో కి తన సిబ్బందితో వచ్చి నిబంధనలకు లోబడి రెస్టారెంట్ నిర్వహిస్తున్న నా భర్త నరసింహారావును, సిబ్బందిని పరుష పదజాలంతో దూషిస్తూ, సిబ్బందిపై దాడి చేశారు. పదే పదే ప్రాధేయ పడినప్పటికీ, సీఐ రాజమోహన్ దురుసుగా వ్యవహరించారు. అక్రమంగా స్టేషన్ కు తీసుకువెళ్లి… మందు అమ్ముకునే వాడివి మందు అమ్ముకోవాలి, లాఠీ దించు తానంటూ, కేసులు పెడతానంటూ బెదిరించారు.
ఈ విషయమై జిల్లా పోలీస్ అధికారులకు ఫిర్యాదు చేశామన్న అక్కసుతో తేది.08.01.2022 న రాత్రి11:00 సమయంలో రెస్టారెంట్ లోకి సిఐ రాజ్ మోహన్ తన సిబ్బందితో చొరబడి రెస్టారెంట్ లో ఉన్న వారిని బెదిరిస్తూ… తరిమికొడుతూ ఉద్దేశపూర్వకంగా మా వ్యాపారం దెబ్బతీయడం కోసం, చట్ట వ్యతిరేకం గా వ్యవహరిస్తున్నారు. మన ప్రభుత్వంలో మా లాంటి వారికే రక్షణ లేని పరిస్థితి రాజమోహన్ లాంటి పోలీస్ అధికారులు కల్పిస్తున్నారు. దయచేసి ఇలాంటి అవినీతి అధికారుల పై చర్యలు తీసుకొని సామాన్యులకు రక్షణ కల్పించాలని మిమ్మల్ని వేడుకుంటున్నాము.
ఇట్లు
సూరగాని లక్ష్మి, 5 వార్డు కౌన్సిలర్ (YSRCP), చీరాల మున్సిపాలిటీ
సూరగాని నరసింహారావు, కనక దుర్గా బార్ అండ్ రెస్టారెంట్, చీరాల