గుంటూరు జిల్లా నరసరావుపేట నియోజకవర్గంలోని రొంపిచర్ల మండలం ఆలవాల గ్రామంలో జరిగిన గ్రామ తెలుగుదేశం పార్టీ సంస్థాగత ఎన్నికల సమావేశంలో దేవినేని ఉమామహేశ్వరరావు నరసరావుపేట ఇంచార్జ్ డా.చదలవాడ అరవింద బాబు తో కలిసి నేడు పాల్గొన్నారు. గ్రామానికి వచ్చిన దేవినేనికి గ్రామంలోని నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. ఎన్టీఆర్ విగ్రహానికి, అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన అనంతరం జరిగిన సభలో దేవినేని మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా తెలుగుదేశం వైసీపీ నాయకుల అరాచకాలు పెచ్చరిల్లాయని రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి కనపడిన భవనానికి రంగులు వేసుకుంటూ పైశాచిక ఆనందం పొందుతున్నారని అన్నారు.
వాళ్ళ మంత్రులే విచక్షణారహితంగా మాట్లాడుతున్నారని అమరావతి పట్ల రోజుకో మాట మాట్లాడుతూ రాష్ట్ర భవిష్యత్తును నాశనం చేశారని వైసీపీ నేతల తీరును దుయ్యబట్టారు. పల్నాడులో సైతం బాంబులకు, బెదిరింపులకు భయపడని డాక్టర్ కోడెల శివప్రసాద్ ను ఆత్మాభిమానం మీద దెబ్బకొట్టి బలిదానం చేసుకునేలా చేశారని ఇది వారి దమననీతికి పరాకాష్ట అని దేవినేని అన్నారు. నిన్నటి వరకు అమరావతి అనేది లేదన్న జగన్ కేంద్రం అమరావతిని రాజధానిగా గుర్తించడంతో సన్నాయి నొక్కులు నొక్కుతూ ఎంతో కొంత పని చేస్తామని అంటున్నాడని జగన్ తీరును దుయ్యబట్టారు.
అమరావతి లో ఇటుక పెట్టలేదు అని గ్లోబల్ ప్రచారం చేసిన నాయకులు అమరావతిలో పూర్తయిన భవనాలకు ఏం సమాధానం చెబుతారని వాళ్ళు పరిపాలన చేస్తుంది అమరావతి నుండి కాదా అని ప్రశ్నించారు. ఈ గ్రామంలో ఎన్నో కేసులు పెట్టి ఇబ్బందులకు గురి చేసి పార్టీ మారాలని బాలకోటి రెడ్డి లాంటి నాయకున్ని ఇబ్బందులకు గురి చేసినా నేను పోతే తెలుగుదేశం తోనే పోతాను అని చెప్పి ధైర్యంగా నిలబడ్డారని ఇటువంటి నాయకులు కార్యకర్తలు ఉన్న తెలుగుదేశాన్ని భూస్థాపితం చేస్తామని అనుకోవడం వారి అవివేకానికి నిదర్శనమన్నారు.
రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో అందరూ కలిసికట్టుగా పనిచేసి తెలుగుదేశం అభ్యర్థులను గెలిపించాలని లేకపోతే ఇప్పటి వరకు ప్రభుత్వ భవనాలకు రంగులు వేసిన వాళ్ళు రేపు మన ఇళ్లకు కూడా వచ్చి రంగులు వేస్తారని దేవినేని అన్నారు. అనంతరం ఏకగ్రీవంగా ఎన్నుకున్న అలవాల గ్రామ కమిటీని అందరికీ పరిచయం చేశారు.