స్థానిక ఖిల్లా లోని జాఫర్ బావిని పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దనున్నట్లు జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ అన్నారు. కలెక్టర్ జాఫర్ బావి పూడికతీత పనులను క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ ఖిల్లా చరిత్ర, జాఫర్ బావి చరిత్ర అధికారులను అడిగి తెలుసుకున్నారు.
చెత్తా చెదారం తో బావి నిండి ఉందని, చెత్త, పూడిక తొలగింపు పనులు జరుగుతున్నట్లు తెలిపారు. పూడికతీత తర్వాత బావి, పరిసరాల సుందరీకరణ పనులు చేపట్టాలన్నారు. కెమికల్ ట్రీట్మెంట్ చేపట్టాలని ఆయన అన్నారు. ఖిలాలో పిచ్చి చెట్లు, పొదలు తొలగించి లైటింగ్ ఏర్పాటు చేయాలన్నారు. చుట్టుపక్కల నుండి మురుగునీరు, చెత్తాచెదారం రాకుండా చర్యలు తీసుకోవాలని ఆయన తెలిపారు. సిసి కెమెరా ఏర్పాటుచేయాలన్నారు.
ప్రాంతం సుందరీకరణ, అభివృద్ధి పట్ల ప్రజల్లో అవగాహన కల్పించి, చైతన్యం తేవాలన్నారు. పనులకు అడ్డుగా ఉన్న విద్యుత్ స్తంభాల తరలింపు చేయాలన్నారు. గెజిట్, రికార్డుల ప్రకారం సర్వే చేపట్టి, ఖిల్లా ప్రాంత రక్షణకు చర్యలు చేయాలన్నారు. మునిసిపల్, పురావస్తు, పర్యాటక శాఖలు సమన్వయం తో ఖిల్లా ను ఆహ్లాదకరమైన మంచి పర్యాటక ప్రదేశంగా తీర్చిదిద్దాలన్నారు.