విశాఖ పట్నంలోని మిలీనియం టవర్స్ లో సచీవాలయం ఏర్పాటు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలపై
నేవీ అధికారులు అభ్యంతరం వ్యక్తం చేసినట్లు తెలిసింది. రక్షణకు అత్యంత కీలకమైన ఐఎన్ఎస్ కళింగకు సమీపంలో జనావాసాలను ఎలా అభివృద్ధి పరుస్తారని నేవీ అధికారులు ప్రశ్నించారని తెలిసింది. శత్రుదేశాలకు విశాఖపట్నం ప్రధాన లక్ష్యమని ఇక్కడ ఇప్పటికే ఎన్నో పరిశ్రమలు, కేంద్ర సంస్థలు ఉన్నాయని తెలిపింది.
కాబట్టి దేశభద్రత దృష్ట్యా ఈ ప్రాంతాన్ని ఎంపిక చేసుకోకపోవడమే మేలని నేవీ అధికారులు తెలుపుతున్నారు. ఒకసారి రాజధాని ఏర్పాటైతే ఆ ప్రాంతమంతా జనావాసాలతో కిటకిటలాడుతుందని దీంతో చాలా సమస్యలు ఎదురవుతాయని ఆందోళన వ్యక్తం చేసింది. ఐఎన్ఎస్ కళింగ వ్యూహాత్మక ప్రాంతమని ఇక్కడ రాజధాని ఏర్పాటుపై సాంకేతిక, భౌగోళిక అంశాలను సమీక్షించాల్సిన అవసరం ఉందని లేఖలో తెలిపింది.
ఐఎన్ఎస్ కళింగ సుమారు 734 ఎకరాల మేర విస్తరించి ఉంది. తూర్పు నావికా దళానికి ఈ ప్రాంతం అత్యంత కీలకమైనది. దీనిపై నేవీ మరింత దృష్టి కేంద్రీకరిస్తోంది. మరిన్ని భూములను సేకరించేందుకు రెడీ అవుతోంది. ఇప్పటికే 400 ఎకరాల భూమిపై నేవీ, రెవెన్యూ శాఖల మధ్య వివాదం నడుస్తోంది. ఈ భూమిని 1980లలో అధికారుల ఇళ్ల కోసం జిల్లా పరిపాలనా విభాగం కేటాయించింది.