కోటి రూపాయలు ట్యాక్స్ కట్టాలంటూ నోటిసు రావడం తో బెంబేలెత్తిపోయారు మహారాష్ట్ర థానేలోని అంబివాలిలో నివసించే భావూసాహెబ్ అహిరే రోజూ రూ.300 కోసం పనిచేసే దినసరి కూలి ఆయన.అయినా అతనికి ఐటీ అధికారులు ఒక కోటి అయిదు లక్షలు ట్యాక్స్ కట్టాలంటూ నోటీసులు పంపించారు. ఇలా నోటీసు రావడం అహిరేకి మొదటిసారేం కాదు.
మొదటి నోటీసును గత సెప్టెంబర్ నెలలో అందుకోగా కానీ దాన్ని అంత పెద్దగా పట్టించుకోలేదు. ఇప్పుడు మరోసారి నోటీసు అందుకున్నాడు. దాంతో అతను పోలీసులను ఆశ్రయించాడు. అసలు విషయం అప్పుడు బయటపడింది. 2016లో నోట్ల రద్దు జరిగిన సమయంలో అహిరే ఖాతాలో రూ. 58 లక్షలు డిపాజిట్ అయ్యాయి. అందుకుగాను కోటి రూపాయలు ట్యాక్స్ కట్టాలని నోటీసు వచ్చిందని అహిరే తెలుసుకున్నాడు.
రోజుకు రూ. 300 లకు పనిచేసే తనకు అంత డబ్బు లేదని వాపోయాడు. అసలు ఆ ఖాతా తనది కాదని అహిరే అన్నాడు. ఈ విషయంపై సదరు బ్యాంకు సిబ్బందిని అడిగితే, అహిరే పేరు మీదనే ఎవరో నకిలీ ఖాతా తెరిచారని తెలిసింది. ఆ ఖాతా ఓపెనింగ్ కోసం అహిరే పాన్ కార్డును ఉపయోగించారని తేలింది. ఫొటో కూడా ఎవరిదో పెట్టడంతో పాటు సంతకం కూడా ఫోర్జరీ చేశారని తేలింది. దాంతో అహిరే పోలీసులను సంప్రదించి ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.