ఢిల్లీ మద్యం కుంభకోణంలో అరెస్ట్ అయిన అరబిందో డైరెక్టర్ శరత్ చంద్రారెడ్డిని తీహార్ జైల్కు తరలించారు. ఆయనకు 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధిస్తూ సిబిఐ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. అక్రమ నగదు చలామణి నిరోధక చట్టం కింద ఇడి శరత్ చంద్రారెడ్డి, పెర్నాడో రికార్డ్ కంపెనీ ప్రతినిధి బినోరు బాబు అరెస్టు చేసిన సంగతి తెలిసందే. రౌస్ అవెన్యూ సిబిఐ ప్రత్యేక కోర్టులో జస్టిస్ ఎంకె నాగ్పాల్ ముందు వీరిని ఇడి అధికారులు హాజరుపరిచారు. అనారోగ్యం దృష్ట్యా ప్రత్యేక సదుపాయాలు కల్పించాలని శరత్ చంద్రారెడ్డి, బినోరుబాబుల తరపు న్యాయవాదులు కోరగా, ప్రత్యేక సదుపాయాలు కల్పించడం సాధ్యం కాదని న్యాయమూర్తి తెలిపారు. తదుపరి విచారణ డిసెంబరు 5కు వాయిదా వేశారు. బెయిలు పిటిషన్లపై ఈ నెల 24న విచారిస్తామని న్యాయమూర్తి పేర్కొన్నారు. అనంతరం బినోరు బాబు, శరత్ చంద్రారెడ్డిలను అధికారులు తీహార్ జైలుకు తరలించారు. కాగా రౌస్ అవెన్యూ కోర్టు వద్ద శరత్ చంద్రారెడ్డిని వైసిపి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డి కలిశారు.
previous post