జిల్లా కేంద్రమైన శ్రీకాకుళం నగరంలో విద్యుత్ కోతలు సాధారణ విషయంగా మారాయి. అందునా నగర పరిధిలోని గుజరాతిపేట సమీపంలోని తోటవీధి నేటికీ టౌన్ ఫీడర్ నుండి విద్యుత్ సరఫరా జరగక పోతుండడంతో ఈ ప్రాంత వాసులు నిత్యం నరకం చూస్తున్నారు.
చిలకపాలెం సబ్స్టేషన్ లో విద్యుత్ కొరత లేదా ఇతర సాంకేతిక కారణాలను ప్రతినిత్యం సాకుగా చూపించి తోట వీధి ప్రాంతంలో ఇష్ట రాజ్యంగా విద్యుత్ కోతలకు పాల్పడుతున్నారు. ఒకవైపు రాష్ట్ర ప్రభుత్వం మరియు ఉన్నతాధికారులు విద్యుత్ కోతలు లేవని ప్రకటనలు చేస్తుండగా నిత్య కృత్యంగా మారిన కరెంటు కోతలతో తోట వీధి ప్రాంత ప్రజలు ముఖ్యంగా వృద్ధులు చిన్నారులు నానా అవస్థలకు గురవుతున్నారు.
నిరంతర విద్యుత్తుకు ప్రభుత్వం ఆదేశాలు ఇస్తున్నప్పటికీ దిగువ స్థాయి సిబ్బంది మరియు కొందరు అధికారుల నిర్లక్ష్యం కారణంగా ప్రజలు రేయింబవళ్లు కరెంటు కోతలతో అవస్థలు పడుతూ వివిధ రకాల వ్యాధులకు గురవుతున్నారు.
తాజాగా శుక్రవారం రాత్రి సుమారు 9:30 గంటల ప్రాంతంలో విద్యుత్తు సరఫరాను నిలిపివేసిన సిబ్బంది అర్ధరాత్రి దాటినప్పటికీ కరెంటును పునరుద్ధరించకపోవడంతో తోట వీధి పరిసర ప్రాంతాల ప్రజలు ఒకవైపు దోమ కాట్లు మరోవైపు చిమ్మ చీకట్లతో బిక్కుబిక్కుమంటూ కాలం గడపాల్సిన పరిస్థితిలో నెలకొన్నాయి.
ఇదే సమయంలో ఈ ప్రాంతంలో ఇటీవల పలు చోరీ సంఘటనలు కూడా జరగడంతో ప్రజలు తీవ్ర భయభ్రాంతులకు గురవుతున్నారు. ఇందుకు కరెంటు కోతలు కూడా తోడవడంతో నిప్పుకు గాలి సహకరించినట్లు ఇక్కడి పరిస్థితులు ఉన్నాయని విద్యుత్తు వినియోగదారులు తీవ్ర ఆగ్రహావేశాలను వ్యక్తం చేస్తున్నారు.
అటు పి ఎన్ కాలనీ ఇటు ఫాజిల్ బాగ్ పేట మరోవైపు గుజరాతి పేట ప్రాంతాలు టౌన్ లీడర్ పరిధిలో ఉన్నప్పటికీ మధ్యలో ఉన్న తోట వీధి ప్రాంతం మాత్రమే రూరల్ విద్యుత్తు ఫీడర్ పరిధిలో ఉండడం వెనుక సంబంధిత శాఖ అధికార యంత్రాంగం నిర్లక్ష్యం మరియు వినియోగదారుల సేవల్లో అలక్ష్యాన్ని ప్రతిబింబిస్తోందని ఈ ప్రాంత వాసులు దుమ్మెత్తి పోస్తున్నారు.
గతంలో పిఎన్ కాలనీలో ఈ ప్రాంతాన్ని టౌన్ లీడర్లు చేర్చేందుకు గాను సబ్ స్టేషన్ ఏర్పాటు చేసేందుకు అవసరమైన చర్యలను చేపట్టినప్పటికీ న్యాయపరమైన అవాంతరాలు ఏర్పడడంతో ఈ ప్రతిపాదనలు అటకెక్కినట్లు వినికిడి. ఇదే సమయంలో పిఎన్ కాలనీ పరిసర ప్రాంతాల్లో ప్రభుత్వ రిజర్వు స్థలాలు ఉన్నప్పటికీ సబ్ స్టేషన్ ఏర్పాటుకు యంత్రాంగం తదుపరి ప్రయత్నాలను చేయకుండా మీ కర్మ మీరు అనుభవించండి అన్న విధంగా వ్యవహరించడంతో ప్రస్తుతం తోట వీధి మరియు పరిసర ప్రాంత గృహ విద్యుత్ వినియోగదారుడు నిత్య నరకాన్ని చవిచూస్తున్నారు.
శుక్రవారం నాటి విద్యుత్ అంతరాయం విషయమై పలువురు విద్యుత్ విభాగం సిబ్బందితోపాటు అధికారులను కూడా సంప్రదించినప్పటికీ ఒంటిగంట ప్రాంతంలో విద్యుత్తు వస్తుందని ప్రస్తుతం 33 కెవి లైన్ మరమ్మత్తు పనులు జరుగుతున్నాయని సుమారు 10 గంటల సమయంలో తెలియజేసినప్పటికీ అర్ధరాత్రి ఒంటిగంట దాటినప్పటికీ విద్యుత్తు పునరుద్ధరణ జరగలేదంటే వీరి పనితీరు వినియోగదారులకు వీరు అందిస్తున్న సేవలను ఇట్టే అర్థం చేసుకోవచ్చు.
అత్యవసర విభాగం జాబితాలో ఉండి వినియోగదారులకు ఎటువంటి అసౌకర్యం కలవకుండా నిత్యం అప్రమత్తంగా వ్యవహరించాల్సిన విద్యుత్ విభాగం సిబ్బంది పనితీరులో నిర్లక్ష్య ధోరణిని బాధ్యత విద్యుత్తు వినియోగదారులు తీవ్రంగా ఆక్షేపిస్తున్నారు. ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ తో పాటు విద్యుత్తు విభాగం సూపరిండెండెంట్ ఇంజనీర్ తక్షణం స్పందించి తోట వీధి పరిసర ప్రాంత విద్యుత్తు సమస్యలపై దృష్టి సారించారని ఈ ప్రాంత ప్రజలు మరియు వినియోగదారులు డిమాండ్ చేస్తున్నారు.