సిద్దేశ్వరంలో జరిగే పశువుల జాతరలో ప్రదర్శించేందుకు కృష్ణానదిలో ప్రమాదకర పరిస్థితుల్లో పశువులను తరలిస్తున్న 12 మందిని పోలీసులు అరెస్టు చేశారు. నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ ప్రాంతంలోని సోమశిల నుంచి సిద్దేశ్వరం వెళ్లేందుకు రోడ్డు మార్గంలో దాదాపు 12 కిలోమీటర్లు ఉంటుంది.
కృష్ణానదిని కేవలం 2 కిలోమీటర్ల దూరం దాటితే సిద్దేశ్వరం చేసుకోవచ్చు. ఈ కారణంతో ప్రమాదకర పరిస్థితుల్లో 12 మంది రైతులు పుట్టిపై కృష్ణా నదిని దాటుతూ పశువులను నదిలో ఈదుకుంటే వెళ్లే విధంగా ఏర్పాటు చేసుకున్నారు.
చాలా కాలంగా ఈ విషయం జరుగుతున్నా కూడా ఒక ఫొటో షూట్ కోసం వెళ్లిన ఒక ఫొటో గ్రాఫర్ ఈ ఫొటోలు షేర్ చేయడంతో ఈ మొత్తం వ్యవహారం బయటకు వచ్చింది.
దాంతో పోలీసులు రంగంలో దిగి 12 మందిని అరెస్టు చేశారు. సోమశిల గ్రామ కార్యదర్శి రాఘవేందర్ ఫిర్యాదు మేరకు సోమశిల గ్రామానికి చెందిన రెడ్డిగారి మల్లయ్య, రెడ్డిగారి నిరంజన్, రెడ్డిగారి వెంకటస్వామి,
రెడ్డిగారి రాముడు, రెడ్డిగారి కాశన్న, సందు తిరుపాల్, సందు కిష్టయ్య, సున్నపు కూర్మయ్య, సున్నపు గంగన్న, సుగురు కృష్ణయ్య, అంకలి మద్దిలేటి, రెడ్డిగారి వెంకటస్వామి లను అరెస్టు చేసినట్లు నాగర్ కర్నూల్ డిఎస్ పి ఎస్ మోహన్ రెడ్డి తెలిపారు.
వీరిపై జంతు హింస నిరోధక చట్టం కింద కేసు నమోదు చేసినట్లు ఆయన తెలిపారు. వారికి కౌన్సిలింగ్ చేసి ఇలాంటి నేరాలు మళ్లీ చేయవద్దని చెప్పి వారిని బైండోవర్ చేసినట్లు డిఎస్ పి తెలిపారు.
ఇలాంటి నేరాలు ఎవరు చేసినా వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.