కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండల కేంద్రంలో సోమవారం రాత్రి ఇసుక లారీ ఢీకొని విజయ్ అనే వ్యక్తికి తీవ్ర గాయాలు కావడంతో ఆగ్రహించిన స్థానికులు లారీని తగులబెట్టారు. అంతే కాకుండా పలు లారీలను కూడా ధ్వంసం చేశారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని క్షతగాత్రుడిని ఆస్పత్రికి తరలించారు. ఇసుక లారీ డ్రైవర్ పై కేసు నమోదు చేసినప్పటికీ ఆందోళనకారులు శాంతించలేదు.
తీవ్ర ఉత్కంఠ మధ్య లో బాన్సువాడ డీఎస్పీ జైపాల్ రెడ్డి, కామారెడ్డి ఎస్పీ శ్వేత రెడ్డి ఘటనా స్థలనికి చేరుకొని ఆందోళనకారులను చెదరగొట్టారు. మంగళవారం బాన్సువాడ డీఎస్పీ జైపాల్రెడ్డి పత్రికా విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. చట్టాన్ని ఎవరూ తమ చేతుల్లోకి తీసుకుంటే సహించబోమని స్పష్టం చేశారు.
రాత్రి జరిగిన ఘటన దురదృష్టకరమని ఇప్పటికే బాధితునికి హైద్రాబాద్ లోని సన్ షైన్ ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నామన్నారు. రాత్రి జరిగిన ఘటనలో బాధ్యతారహితంగా వ్యవహరించిన వారిని ఇప్పటికే గుర్తించామని వారి పైన కేసులు నమోదు చేస్తామని స్పష్టం చేశారు.
చట్టాన్ని ఎవరు చేతుల్లోకి తీసుకుంటే కఠిన చర్యలు తప్పవని ఆయన పునరుద్ఘాటించారు. బిచ్కుందలో ఇప్పటికే ఆరు పికెటింగ్లు ,ఆరు పెట్రోలింగ్ వాహనాలు ,యాభై మంది పోలీసు,ఆరుగురు ఎస్ఐలు ముగ్గురు సీఐలు ఇద్దరు డీఎస్పీలు శాంతిభద్రతల పర్యవేక్షణ చేస్తున్నామన్నారు.
డిసెంబర్ ముప్పై ఒకటి నాడు కూడా పది గంటల తర్వాత ఎవ్వరు కూడా మద్యం తాగి హెల్మెట్ లేకుండా ముగ్గురు వాహనాలపైన తిరాగరాదన్నారు. అలా లేని యెడల కేసులు నమోదు చేస్తామని ఆయన స్పష్టం చేశారు.
ఫోన్లో ఎవరైనా వ్యక్తిగత వివరాలు అడిగితే ఇవ్వరాదు
ఈ మధ్యన సైబర్ క్రైమ్ నేరాలు భారీగా పెరుగుతున్నాయని ఫోన్లో వ్యక్తిగత వివరాలను ఎవరికి ఇవ్వవద్దని డీఎస్పీ జైపాల్ రెడ్డి అన్నారు. లక్కీ లాటరీ తగిలింది డ్రాలో మీరు గెలుపొందారు అని అనేక ఫోన్లు వస్తున్నాయని వాటి పట్ల అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు. ప్రజలను మోసం చేయడానికి అనేక యాప్ లు వచ్చాయని కావున ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని ఆయన అన్నారు.