ఆపదలో ఉన్నవారికి రక్తదానం చేసి ఎంతో మందికి పునర్జన్మ ను ప్రసాదించే ఉద్యమాన్ని చేస్తున్నాడు ఈ పోలీసు అధికారి. అరుదుగా ఉండే ఇలాంటి పోలీసు అధికారుల గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. ఎల్బీనగర్ ట్రాఫిక్ అదనపు ఇన్ స్పెక్టర్ అంజపల్లి నాగమల్లన్న ఇప్పటికి 29 సార్లు రక్తదానం చేశారు. విధి నిర్వాహణలో ఉన్న ఇన్ స్పెక్టర్ నాగమల్లుకు బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ నుంచి నేడు ఫోన్ కాల్ వచ్చింది.
ఆ ఫోన్ కాల్ సారంశం ఏమిటంటే అక్కడ చికిత్స పొందుతున్న ఒక మహిళ కు అత్యవసరంగా రక్తం అవసరం అని. ఆపరేషన్ నిమిత్తం బ్లడ్ అవసరం ఉన్నదని ఋషిత చారిటబుల్ ట్రస్ట్ ద్వారా సమాచారం అందుకున్న నాగమల్లు వెంటనే తన ఉన్నత అధికారుల అనుమతితో అక్కడకు వెళ్లారు. బంజారాహిల్స్ లోని బసవతారకం హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న మహిళ కుటుంబ సభ్యులను, వైద్యులను కలిసి తక్షణమే రక్తదానం చేసి వారికి తమ వంతుగా ఎప్పుడు అండగా ఉంటానని అభయం ఇచ్చారు నాగమల్లు.
ఇది ఆయన 29వ రక్తదానం. రక్తదానం చేసిన తర్వాత మళ్లీ వచ్చి యధావిధిగా తన విధులకు హాజరయ్యారు నాగమల్లు. ఇప్పటికే గడిచిన 20 సంవత్సరాలలో 29 సార్లు రక్తదానం చేసిన ఈ పోలీసు అధికారి, రక్తదానం చేసి రోడ్డు ప్రమాదాల్లో గాయపడి ప్రాణాపాయ స్థితిలో ఉన్న వారిని ఎందరినో కాపాడారు. హేట్సాఫ్ టు నాగమల్లు.