దేశంలోని 75 శాతం మంది పెద్దలకు కరోనా వాక్సినేషన్ పూర్తి అయింది. ఈ ఘన సాధించిన దేశ ప్రజలకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అభినందనలు తెలిపారు. 75 శాతం వయోజనులకు టీకాలు వేయాలనే లక్ష్యాన్ని భారతదేశం సాధించిందని కేంద్ర ఆరోగ్య మంత్రి మన్సుఖ్ మాండవియా చేసిన ట్వీట్ను ట్యాగ్ చేస్తూ ప్రధాని ఈ వ్యాఖ్య చేశారు. అతి ముఖ్యమైన ఈ ఘట్టాన్ని సాధించినందుకు అభినందనలు అని ప్రధాని అన్నారు. కరోనా వ్యాక్సినేషన్ డ్రైవ్ ను డ్రైవ్ను విజయవంతం చేస్తున్న వారందరికీ అభినందనలు తెలిపారు. దేశంలో ఇప్పటివరకు ఇచ్చిన యాంటీ-కోవిడ్ వ్యాక్సిన్ డోస్ల సంఖ్య 165.70 కోట్లు దాటింది. దేశంలో ఒక వైపు కరోనా కేసులు పెరుగుతున్నా ఆసుపత్రులకు వచ్చే వారి సంఖ్య తగ్గుతున్నది. అందులోనూ మరణాల సంఖ్య మరింత తక్కువగా ఉన్నది. ఇదంతా వ్యాక్సినేషన్ ప్రక్రియను సమర్ధంగా అమలు చేయడం వల్లే జరుగుతున్నదని వైద్యశాస్త్ర నిపుణులు చెబుతున్నారు. దేశంలో కరోనా వ్యాక్సినేషన్ డ్రైవ్ ఇంత సమర్ధంగా, వేగంగా జరుగుతుందని చాలా మంది ముందుగా ఊహించలేదు.