ఉత్తరాఖండ్ లోని ధేలా నది ప్రవాహంలో ఒక ఇన్నోవా కారు కొట్టుకుపోవడంతో తొమ్మిది మంది మృతిచెందారు. నేటి ఉదయం నుంచి రాంనగర్లోని ధేలా నది ప్రవాహం ఉధృతం అయింది. అటుగా వస్తున్న పర్యాటకుల కారు ఆ ఉధృతికి కొట్టుకుపోయింది. కారులో ఉన్న పది మందిలో తొమ్మిది మంది మృతి చెందగా, ఒకరు తీవ్రంగా గాయపడి రాంనగర్ ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
మృతులను గుర్తించే పనిలో పోలీసులు నిమగ్నమయ్యారు. పర్యాటకులు పంజాబ్లోని పాటియాలా వాసులుగా చెబుతున్నారు. ఘటనా స్థలంలో స్థానిక పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఉన్నారు. ధేలా రాంనగర్లోని ఓ రిసార్ట్లో బస చేసి తిరిగి వస్తున్న ఇన్నోవా కారులో పది మంది పర్యాటకులు ఉన్నారు.
ఉదయం 5:45 గంటలకు, పర్యాటకులు ధేలా నది మార్గానికి చేరుకున్నారని, వారి కారు నదిలో బలమైన ప్రవాహానికి కొట్టుకుపోయిందని చెప్పారు. కారులో ఉన్న నలుగురు పర్యాటకుల మృతదేహాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
22 ఏళ్ల నాజియా అనే యువతి గాయపడిన స్థితిలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నది. కారులో ఇంకా ఐదుగురి మృతదేహాలు ఉన్నాయని, వారిని బయటకు తీసేందుకు ప్రయత్నాలు కొనసాగుతున్నాయని కొత్వాల్ అరుణ్ కుమార్ సైనీ తెలిపారు. ఘటనా స్థలానికి క్రేన్ను రప్పించి కారును నదిలో నుంచి బయటకు తీశారు.
మృతుల్లో ముగ్గురు యువకులు, ఆరుగురు మహిళలు ఉన్నారు. గాయపడిన బాలిక ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. ఆమె ఇప్పటికీ షాక్లో ఉంది. మృతులను గుర్తించేందుకు ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. ప్రాథమిక సమాచారం ప్రకారం, పర్యాటకులు పాటియాలా పంజాబ్ వాసులు, వారు ధేలా రిసార్ట్కు వచ్చి ఉదయం తిరిగి వస్తున్నారు.