40.2 C
Hyderabad
April 26, 2024 11: 39 AM
Slider ప్రత్యేకం

ఆదానీ వ్యవహారంపై దర్యాప్తు జరిపించాలి

#MLC Kalvakuntla Kavitha

ఆదానీపై కంపెనీలపై వచ్చిన ఆరోపణలపై దర్యాప్తు జరిపించాలని, నిష్పక్షపాత దర్యాప్తు కోసం సంయుక్త పార్లమెంటరీ కమిటీని ఏర్పాటు చేయాలని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు. సోమవారం ఆమె శాసన మండలి ఆవరణలో మీడియాతో మాట్లాడారు. దేశంలో సంక్షోభిత పరిస్థితులు నెలకొన్నాయని ఆందోళన వ్యక్తం చేశారు.

ఆదానీ సంస్థల షేర్ల విలువలు పడిపోతున్నా కూడా దేశ ఆర్థిక వ్యవస్థపై ప్రభావం పడబోదని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి ప్రకటించడం దారుణమని విమర్శించారు. ఆదానీతో పాటు ఎస్బీఐ, ఎల్ఐసీ వంటి సంస్థల షేర్ల విలువ గత నెల 23వ తేదీ నుంచి భారీగాపడిపోయాయని, దాంతో సామాన్యులకు తీవ్ర నష్టం జరిగిందని తెలిపారు.

రూ. 3600 గా ఉన్న ఆదానీ షేర్ విలువ ఇప్పుడు దాదాపు రూ. 1400కు పడిపోయిందని గుర్తు చేశారు. దాదాపు రూ. 10 లక్షల కోట్ల మేర దేశ ప్రజల సంపద ఆవిరయితే అంతా బాగేనే ఉందని ఆర్థిక శాఖ మంత్రి ఎలా అంటారని ప్రశ్నించారు. ప్రధాని మోడీ ఎందుకు మౌనంగా ఉంటున్నారని అడిగారు. కాబట్టి ఈ వ్యవహారంపై దర్యాప్తు జరిపించాలని డిమాండ్ చేశారు. నిష్పక్షపాత దర్యాప్తు కోసం సంయుక్త పార్లమెంటరీ కమిటీని ఏర్పాటు చేయాలని స్పష్టం చేశారు.

ఆదానీ వ్యవహారంపై ప్రజల ముందుకు వచ్చి వివరణ ఇవ్వాల్సిన నైతిక బాధ్యత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీపై ఉందని పేర్కొన్నారు. ప్రధాన మంత్రి మోడీ మద్ధతులో ఆదానీ అపారమైన సంపదను కూడబెట్టిన విషయం ప్రపంచమంతా తెలుసునని అన్నారు. ఆదానీ వ్యవహారంపై ఎవ్వరు ప్రశ్నించినా అంతా బాగానే ఉందని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి, రిజర్వు బ్యాంకు చెబుతున్నారని చెప్పారు. ఏ ప్రభుత్వం మద్ధతుతో ఆదానీ రూ. 60 వేల కోట్ల నుంచి రూ. 10 లక్షల కోట్లకు వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించారో అందరికి తెలుసన్నారు.

కేంద్రంలోని మోడీ బడ్జెట్ దేశాన్ని నిరుత్సాహపర్చితే కేసీఆర్ బడ్జెట్ మాత్రం దేశానికి స్పూర్తినిస్తుందని తెలిపారు. రూ. 2.9 లక్షల కోట్లతో తెలంగాణ ప్రభుత్వం బడ్జెట్ ను ప్రవేశపెట్టడం సంతోషకరమైన విషయమన్నారు. దేశానికి స్పూర్తిగా నిలిచే అంశాలు ఈ బడ్జెట్లో ఎన్నో ఉన్నాయని వివరించారు. దామాషా ప్రకారం బడ్జెట్ ను కేటాయించామని, సామాజిక రంగంలో ఆయా వర్గాల జనాభాకు అనుగుణంగా కేటాయింపులు ఉన్నాయని స్పష్టం చేశారు.

గ్రామీణ ఆర్థిక వ్యవస్థ పురోగమించే విధంగా రాష్ట్ర బడ్జెట్ ఉందని చెప్పారు. కేంద్రంలోని మోడీ ప్రభుత్వం గ్రామీణ వ్యవస్థను విస్మరించిందని విమర్శించారు. దేశంలో లక్షలాది మంది ఉపాధి కల్పిస్తున్న మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకానికి కోత విధించిందని, తక్షణమే ఆ పథకానికి నిధులను పెంచాలని డిమాండ్ చేశారు. ఆర్థిక సంఘం నిధులను నేరుగా స్థానిక సంస్థలకు ఇవ్వడం పట్ల సీఎం కేసీఆర్ కు కవిత కృతజ్ఞతలు తెలిపారు.

Related posts

జైల్లో మగ్గుతున్న ఖైదీలకు బైయిల్ మంజూరు చేయండి

Satyam NEWS

లోకేష్ ను చూస్తే జగన్ కు భయం

Satyam NEWS

ధర్మ ఛత్రం

Satyam NEWS

Leave a Comment