మత్స్య సంపద పెంపొందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని జిల్లా పరిషత్ చైర్మన్ ఎమ్మెల్యే కుసుమ జగదీశ్వర్ అన్నారు. గురువారం ములుగు మండలం జాకారం గ్రామ ఊర చెరువులో జిల్లా పరిషత్ చైర్మన్, ములుగు ఎమ్మెల్యే ధనసరి అనసూయ తో కలిసి చేప పిల్లలను విడుదల చేసి, జిల్లాలో చేప పిల్లల విడుదల కార్యక్రమాన్ని ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాష్ట్రంలో నీలి విప్లవం చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం పని చేస్తుందని, నీటిపారుదల ప్రాజెక్టులు, రిజర్వాయర్లు, చెరువులలో చేప పిల్లలను ఉచితంగా విడుదల చేయడం ద్వారా మత్స్యసంపద పెంచుతుందని, నీటి వనరులు ఉన్న చేప పిల్లల పై మత్స్యకారులకు సంపూర్ణ హక్కు కల్పించిందని చైర్మన్ అన్నారు.
అనంతరం చెరువులో చేప పిల్లలను విడుదల చేసిన జిల్లా కలెక్టర్ ఎస్. క్రిష్ణ ఆదిత్య మాట్లాడుతూ, ఈ సంవత్సరం జిల్లాలోని మత్స్య పారిశ్రామిక సహకార సంఘాల పరిధిలో ఉన్న 355 కుంటలు చెరువుల్లో ఒక కోటి 15 లక్షల 44 వేల చేపపిల్లలను ఉచితంగా విడుదల చేస్తున్నట్లు తెలిపారు.
జిల్లాలో ఏటూరునాగారం మండలంలో 17, గోవిందరావు పేట మండలంలో 19, కన్నాయిగూడెం మండలంలో 6, మంగపేట మండలంలో 54, ములుగు మండలంలో 89, తాడ్వాయి మండలంలో 65, వెంకటాపూర్ మండలంలో 72, వెంకటాపురం మండలంలో 19, వాజేడు మండలంలో 14 చెరువుల్లో చేప పిల్లలు వదులుతున్నట్లు ఆయన అన్నారు.
చేపలు విడుదల చేస్తున్న ప్రతి చోట సహకార సంఘాల సమక్షంలో చేయాలని, ఫోటో, విడియోగ్రఫీ చేయించాలని అన్నారు. ఎక్కువ డిమాండ్ ఉన్న చేప పిల్లలు, దిగుబడి ఎక్కువ వచ్చి, సంఘ సభ్యులకు మంచి ఆదాయం వచ్చే విధంగా ఉండాలన్నారు.
అనంతరం జిల్లా పరిషత్ చైర్మన్, ఎమ్మెల్యే, కలెక్టర్లు చెరువు కట్టకిరువైపుల మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో జిల్లా మత్స్య శాఖ అధికారి వీరన్న, ములుగు ఎంపిపి జి. శ్రీదేవి, ఎంపిడివో రవి, జెడ్పిటిసి ఎస్. భవాని, స్థానిక సర్పంచ్ డి. రమేష్, ఎంపీటీసీ రాధిక, జిల్లా మత్స్య సహకార సంఘం అధ్యక్షులు బి. మల్లేశం, జాకారం సంఘ అధ్యక్షులు ఆర్. రవీందర్ తదితరులు పాల్గొన్నారు.