ఓటరు ఐడి కార్డుకు ఆధార్ కార్డు నెంబన్ ను అనుసంధానం చేసే ప్రక్రియను.. తమ వంతు బాధ్యతగా స్వీకరించాలని కడప జిల్లా కలెక్టర్ వి.విజయ్ రామరాజు రాజకీయ పార్టీల ప్రతినిధులకు సూచించారు. దేశవ్యాప్తంగా ఓటర్ల జాబితాలను ఆధార్ నంబర్లతో అనుసంధానం చేసే ప్రక్రియ ప్రారంభమైన నేపథ్యంలో మంగళవారం కలెక్టరేట్ లోని తన ఛాంబర్ లో జిల్లా కలెక్టర్ వి.విజయ్ రామరాజు, జేసీ సాయికాంత్ వర్మతో కలిసి పొలిటికల్ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు.
ఈ సందర్బంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ నకిలీ ఓట్లను అరికట్టడం, బోగస్ ఓటర్ ఐడీలను ఏరివేస్తూ పారదర్శకంగా ఓటర్ల జాబితా రూపొందించడంలో భాగంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తీవ్ర కసరత్తులు చేస్తున్నాయన్నారు. ఈ క్రమంలోనే ఓటర్ల జాబితాలను ఆధార్ నంబర్లతో అనుసంధానం చేసే ప్రక్రియ ఇప్పటికే దేశ వ్యాప్తంగా ఈ నెల 1వ తేదీ నుండి ప్రారంభమైందన్నారు.
ఇందులో భాగంగా.. ఓటర్ల జాబితాలో పేర్ల నమోదు, తొలగింపు, వివరాల దిద్దుబాటు, అడ్రెస్ మార్పు తదితర అవసరాలకు సంబంధించిన కొత్త దరఖాస్తుల విధానం అమల్లోకి తీసుకురావడం జరిగిందన్నారు.
99 శాతం మందికి ఆధార్ కార్డు
రాష్ట్రంలో ఇప్పటికే 99% పైగా ప్రతి పౌరుడూ ఆధార్ గుర్తింపు కార్డులు పొందడం జరిగిందని, ఇంక ఎవరికైనా ఆధార్ గుర్తింపు కార్డు లేని పక్షంలో కూడా.. ప్రత్యామ్నాయంగా గ్రామీణ ఉపాధి హామీ పథకం జాబ్ కార్డు, ఫొటోతో కూడిన పోస్టాఫీస్/బ్యాంక్ పాస్బుక్ , ప్రభుత్వం జారీ చేసిన హెల్త్ ఇన్సూరెన్స్ స్మార్ట్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్, పాన్కార్డు, ఇండియన్ పాస్పోర్ట్, పెన్షన్ డాక్యుమెంట్ విత్ ఫొటోగ్రాఫ్, సర్వీస్ ఐడెంటిటీ కార్డు విత్ ఫొటోగ్రాఫ్, అఫీషియల్ ఐడెంటిటీ కార్డు, యూనిక్ ఐడెంటిటీ కార్డు, మొదలైన పది రకాల గుర్తింపు పొందిన ధ్రువీకరణ పత్రాలతో ఓటరుగా పేరును నమోదు చేసుకునే అవకాశాన్ని ప్రభుత్వం కల్పిస్తోందని తెలిపారు.
ఈ ఆధార్ అనుసంధాన ప్రక్రియ ద్వారా ఓటర్లు తమ పేర్లలో, కుటుంబ సభ్యుల పేర్లలో, వయస్సులో, చిరునామాలో తేడాలు ఉంటే సరి చేసుకోవాలని ఈ అవకాశాన్ని జిల్లాలోని ఓటర్లు వినియోగించుకునేలా రాజకీయ పార్టీల ప్రతినిధులు ప్రజలను ప్రోత్సహించాలన్నారు.
ఆధార్ తో లింక్ కోసం కాల్ సెంటర్
ఫోన్ ద్వారా ఆధార్ ఓటర్ ఐడి కార్డులను లింక్ చేయడానికి భారత ప్రభుత్వం దేశంలోని వివిధ రాష్ట్రాల్లో అనేక కాల్ సెంటర్లను ఏర్పాటు చేసింది. ఓటర్లు 1950 నంబర్కు కాల్ చేసి ఆధార్ నంబర్తో పాటు తమ ఓటర్ ఐడీ వివరాలను అప్ లోడ్ చేసుకునే సదుపాయం ఉందన్నారు.
ఎన్నికల సంఘం నిర్వహించే పోర్టల్, ఎస్ఎంఎస్ పంపడం ద్వారా, ఫోన్ ద్వారా ఆధార్ తో ఓటర్ ఐడీలను అనుసంధానం చేసుకోవచ్చనే విషయాన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులు గుర్తెరిగి ప్రజలను చైతన్య పరచాలన్నారు. అంతే కాకుండా బూత్ లెవల్ ఆఫీసర్ల ద్వారా ఓటర్ల మొత్తం సమాచారాన్ని సేకరించి, ఓటర్ ఐడి కార్డుతో ఆధార్ కార్డుని లింక్ చేయడం జరుగుతుందన్నారు.
పార్టీల ప్రతినిధులు తమ పరిధిలోని ప్రజలకు ఈ సౌకర్యం కల్పించేందుకు ఎప్పటికప్పుడు అవగాహనా క్యాంపులు కూడా నిర్వహించడంలో ప్రధాన పాత్ర పోషించాలన్నారు. ఎన్నికల సంఘం కొత్త నిబంధనల ప్రకారం ఏడాదిలో నాలుగు సార్లు 18 ఏళ్లు నిండిన వారిని గుర్తించి ఓటరుగా జాబితాలో పేరును నమోదు చేసే అవకాశం ఉందన్నారు. ఆ ప్రకారంగా జనవరితో పాటు ఏప్రిల్, జూలై, అక్టోబర్ మసాల 1వ తేదీ లోపు 18 ఏళ్లు నిండితే ఓటరు జాబితాలో పేరును నమోదు చేసుకోవచ్చని సంబందిత వివరాలను ఎన్వీఎస్పీ పోర్టల్ నందు చూడవచ్చన్నారు.
ప్రజలకు దగ్గరగా వారితో మమేకమై.. సేవలందించేది రాజకీయ పార్టీల ప్రతినిధులే కావున ఆధార్ కార్డులను ఓటరు ఐడి కార్డులతో అనుసంధానం చేసే ప్రక్రియను పౌరులతో పాటు.. అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులు బాధ్యతగా స్వీకరించాలన్నారు. చైతన్యపరచడంలో అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులు ప్రభుత్వానికి సహకరించి, ఆధార్ అనుసంధాన ప్రక్రియను జిల్లాలో 100% పూర్తి అయ్యేలా చూడాలన్నారు.
ఈ కార్యక్రమంలో డిఆర్వో రామ్మోహన్, కలెక్టరేట్ సూపరింటెండెంట్ శివారెడ్డి, పలు రాజకీయ పార్టీల ప్రతినిధులు లక్ష్మణరావు (బీజేపీ), కాంగ్రెస్ , వెంకటశివ (సీపీఐ), హరిప్రసాద్ (తెదేపా), నీలి శ్రీనివాసరావు (ఐఎన్ సి) లతో పాటు వైసిపి నుండి కార్పొరేటర్లు షఫీ, మల్లికార్జున, పాకా సురేష్ తదితరులు పాల్గొన్నారు.