పరిశుభ్రమైన గాలి, నీరు మానవ మనుగడకు మూలాధారమని ఏపీలోని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎం.హరి జవహర్లాల్ అన్నారు. ఈ రెండింటినీ పరిరక్షించుకోవాల్సిన బాధ్యత పౌరులపై ఉందని, దానికి ప్రతీఒక్కరూ ముందుకు రావాలని కోరారు. తమ ప్రాంతంలోని పార్కులు, జలాశయాలను శుభ్రంచేసేందుకు ఎవరు ముందుకువచ్చినా తమవంతు సహకారం అందిస్తామని స్పష్టం చేశారు.
విజయనగరం నగరంలోని ప్రదీప్నగర్ మున్సిపల్ పార్కులో కలెక్టర్ డాక్టర్ హరి జవహర్లాల్ మొక్కలను నాటారు. పార్కు సుందరీకరణకు శ్రీకారం చుట్టారు. అనంతరం పద్మావతి నగర్లోని పివిఆర్ కాలనీలో ఉన్నవల్లపూడి చెరువు, ధర్మపురిలోని ఊర చెరువులను సందర్శించారు. ఈ రెండు చెరువులను ఎంవిజిఆర్ కళాశాల సుమారు 22 లక్షలు వెచ్చించి చేపడుతున్న అభివృద్ది పనులను కలెక్టర్ పరిశీలించారు. పలు సూచనలు చేశారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పట్టణంలో సుమారు 44 పార్కులను అభివృద్ది చేసి, సుందరంగా మార్పుచేయడం జరిగిందన్నారు. ఈ పార్కుల్లో మొక్కలను వేయడంతోపాటుగా వాకింగ్ ట్రాక్లు, షటిల్, వాలీబాల్ కోర్టులు, ఓపెన్ జిమ్, రంగురంగుల విద్యుత్ దీపాలను ఏర్పాటు చేశామన్నారు. అలాగే జల వనరుల సంరక్షణలో భాగంగా సుమారు 93 చోట్ల కట్టడాలను నిర్మించి, భూగర్భజలాలను పెంచే ప్రయత్నం చేస్తున్నామన్నారు. మొక్కలను నాటడం ద్వారా పరిశుభ్రమైన గాలి, ఆరోగ్యం సిద్దిస్తాయని అన్నారు. ఈ కార్యక్రమాల్లో ప్రజా భాగస్వామ్యం అపూర్వంగా ఉందని పౌరులను కలెక్టర్ అభినందించారు. ప్రస్తుతం జరుగుతున్న ప్రయత్నాలన్నీ, భవిష్యత్ తరాలకు ఎంతో మేలు చేస్తాయని ఆయన స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమాల్లో కార్పొరేషన్ కమిషనర్ ఎస్ఎస్ వర్మ, జిల్లా అటవీశాఖాధికారి ఎస్.జానకిరావు, హరిత విజయనగరం కో-ఆర్డినేటర్ ఎం.రామ్మోహన్, డాక్టర్ వెంకటేశ్వర్రావు, మేకా కాశీవిశ్వేశ్వరుడు, మేకా అనంతలక్ష్మి, మున్సిపల్ ప్లాంటేషన్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.