భారత వైమానిక దళం శ్రీనగర్లో ఎయిర్ షో నిర్వహించింది. ఇందులో, స్కై డైవింగ్ టీమ్ గెలాక్సీ, సూర్య కిరణ్ ఏరోబాటిక్, డిస్ప్లే టీమ్ దాల్ సరస్సుపై తమ వైమానిక విన్యాసాలను ప్రదర్శించాయి. పారామోటర్ ఫ్లైయింగ్ ఈ కార్యక్రమానికి హైలైట్ గా నిలిచింది. కాశ్మీర్ లోయలో 13 సంవత్సరాల తర్వాత ప్రదర్శన జరిగింది.
ఎయిర్ ఫోర్స్ సింఫోనిక్ ఆర్కెస్ట్రా కూడా ఇందులో పాల్గొంది. శ్రీనగర్ ఎయిర్ ఫోర్స్ స్టేషన్, జమ్మూ కాశ్మీర్ అడ్మినిస్ట్రేషన్ ‘ఆజాది కా అమృత్ మహోత్సవ్’ వేడుకల్లో భాగంగా ఎయిర్ షో నిర్వహించినట్లు ఐఏఎఫ్ అధికారులు తెలిపారు. లోయలోని యువతను వైమానిక దళంలో చేరేలా, పర్యాటకాన్ని ప్రోత్సహించడం లక్ష్యంగా ఈ ఎయిర్ షో నిర్వహించినట్లు చెప్పారు.
వేలాది మంది ప్రజలు దాల్ సరస్సు ఒడ్డున ప్రదర్శనను వీక్షించారు. IAF ప్రదర్శనను జమ్మూ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా ప్రారంభించారు. జమ్మూ కాశ్మీర్లోని షేర్-ఇ-కాశ్మీర్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్లో ఎయిర్ షో జరిగింది. ప్రదర్శనలో యుద్ధ విమానాలు, చినూక్స్, పారాచూట్లతో సహా హెలికాప్టర్లు ఆకాశంలో ప్రేక్షకులను ఉర్రూతలూగించాయి.