అమెరికాలోని న్యూయార్క్ కోర్టులో భారత్కు ఊరట లభించింది. అమెరికాలోని ఎయిర్ఇండియా ఆస్తులను స్వాధీనం చేసుకోవాలన్న కెయిర్న్ప్రయత్నాలను న్యూయార్క్ జిల్లా కోర్టు తాత్కాలికంగా నిలిపివేసింది. అంతర్జాతీయ మధ్యవర్తిత్వ కోర్టు ఇచ్చిన తీర్పు మేరకు.. 1.2 బిలియన్ డాలర్లు రాబట్టుకునేందుకు.. ఆమెరికాలోని ఎయిర్ ఇండియా ఆస్తులను స్వాధీనం చేసుకునేందుకు కెయిర్న్ ప్రయత్నాలు చేస్తోంది.
అయితే రెట్రోస్పెక్టివ్ పన్నును రద్దు చేసేందుకు కొత్త చట్టాన్ని రూపొందిస్తున్నందున.. అప్పటి వరకు స్టే విధించాలని భారత ప్రభుత్వం న్యూయార్క్ కోర్టును కోరింది. భారత్ అభ్యర్థనను పరిశీలించిన కోర్టు ఎయిర్ఇండియా ఆస్తుల జప్తు ప్రక్రియను తాత్కాలికంగా నిలిపివేసింది.
2006లో కెయిర్న్ ఎనర్జీ కంపెనీ అంతర్గత పునర్వ్యవస్థీకరణ సమాచారాన్ని కోరుతూ కేంద్ర ప్రభుత్వ పన్నుల విభాగం నోటీసులు జారీ చేసింది. పరిశీలన అనంతరం 2015లో రూ.10,247 కోట్ల పన్నులు చెల్లించాలని కోరింది. పునర్వ్యవస్థీకరణ వల్ల వచ్చిన మూలధన రాబడిపై ఈ మేరకు పన్ను చెల్లించాలని కోరింది. 2010-11లో కెయిర్న్ ఎనర్జీ భారత్లోని తన అనుబంధ సంస్థ ‘కెయిర్న్ ఇండియా’ను వేదాంతకు విక్రయించింది.
ఈ క్రమంలో వేదాంతలో ప్రిఫరెన్షియల్ షేర్లతో పాటు ఐదు శాతం వాటాలను ఇచ్చారు. దీంతో వేదాంతలోని ఐదు శాతం కెయిర్న్ ఎనర్జీ షేర్లను భారత ప్రభుత్వం అటాచ్ చేసింది. అలాగే రూ.1,140 కోట్ల డివిడెండ్లు, రూ.1,590 కోట్ల ట్యాక్స్ రీఫండ్ కూడా నిలిపివేసింది. తదనంతరం తమకు రావాల్సిన పన్ను వసూలు కోసం అటాచ్ చేసిన వేదాంత షేర్లను విక్రయించింది.