హత్రాస్ కేసుకు సంబంధించి ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్న చర్యలపై అలహాబాద్ హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.
ముఖ్యంగా అత్యాచారానికి గురైన దళిత యువతి భౌతిక కాయాన్ని అర్ధరాత్రి దహనం చేయడానికి అనుమతించిన జిల్లా మేజిస్ట్రేట్ పై ఇప్పటి వరకూ చర్యలు తీసుకోనందుకు రాష్ట్ర ప్రభుత్వం సమాధానం చెప్పాలని అలహాబాద్ హైకోర్టు సంజాయిషీ కోరింది.
దాంతో ఒక్క సారిగా ఉలిక్కిపడ్డ రాష్ట్ర ప్రభుత్వం, మళ్లీ కేసు విచారణకు వచ్చే లోపు తగిన చర్యలు తీసుకుంటామని కోర్టుకు వివరణ ఇచ్చింది. సెప్టెంబర్ 14న ఒక దళిత యువతిపై నలుగురు యువకులు అత్యాచారం చేసిన విషయం దేశవ్యాప్తంగా సంచలనం కలిగించింది.
ఆ దళిత యవతి అనంతరం ఢిల్లీలోని సఫ్దర్ జంగ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ 29వ తేదీన మరణించింది. మరణించిన వెంటనే శవాన్ని తీసుకువచ్చి రాత్రికి రాత్రే పోలీసులు దహనం చేశారు. దీనికి అక్కడి జిల్లా మేజిస్ట్రేట్ అనుమతులు ఇచ్చారు.
దీనిపై అలహాబాద్ హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. మేజిస్ట్రేట్ ప్రవీణ్ కుమార్ పై కఠిన చర్యలు ఎందుకు తీసుకోలేదని కోర్టు ప్రభుత్వాన్ని ప్రశ్నించింది.