స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి రాష్ట్ర హైకోర్టు మరో సారి అక్షింతలు వేసింది. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ కు ఉద్దేశపూర్వకంగానే రాష్ట్ర ప్రభుత్వం సహకరించడం లేదని కోర్టు వ్యాఖ్యానించింది. మీకు ఇష్టం లేని వ్యక్తి ఉన్నారని ఉద్దేశ్యపూర్వకంగానే మీరు సహకరించడం లేదు అంటూ తీవ్రంగా మందలించింది.
ప్రభుత్వ పాలకులు మారినా రాజ్యాంగ వ్యవస్థలను కాపాడుకోవాల్సిన అవసరం ఉందని రాష్ట్ర హైకోర్టు వ్యాఖ్యానించింది. రాజ్యాంగ వ్యవస్థల పట్ల ఈ విధమైన వైఖరి మంచిది కాదని కోర్టు వ్యాఖ్యానించింది. రాజ్యాంగ వ్యవస్థల స్వయం ప్రతిపత్తిని కాపాడకపోతే అనర్థాలు జరిగే అవకాశం ఉందని కోర్టు అభిప్రాయపడింది.
రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఏమేం కావాలో అన్నీ వివరంగా చెప్పాలని రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని హైకోర్టు ఆదేశించింది. రాష్ట్ర ఎన్నికల సంఘం అడిగినవన్నీ రాష్ట్ర ప్రభుత్వం మూడు రోజుల్లో చేయాలని, అలా చేయకపోతే తాము జోక్యం చేసుకుని తదనుగుణంగా ఆదేశాలిస్తామని రాష్ట్ర హైకోర్టు స్పష్టం చేసింది.
ప్రభుత్వాలు వస్తాయి, వెళ్తాయి.. రాజ్యాంగబద్ద సంస్థలు ఎప్పుడూ పనిచేస్తాయి. ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టుకోవాలి దీనిపై ఎస్ఈసీ సమగ్రమైన నివేదిక ఇవ్వాలి అని కోర్టు ఆదేశాలిచ్చింది. ఎన్నికల కమిషనర్ గా పని చేసిన జస్టిస్ కనగరాజ్ కోసం ఖర్చు పెట్టిన డబ్బుల్ని ఈసీ చెల్లించక్కర్లేదని కోర్టు అభిప్రాయపడింది. కనగరాజ్ ఆ డబ్బులు తాను వ్యక్తిగతంగానే చెల్లించాలని కోర్టు ఆదేశించింది.