ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమరావతి నుంచి కార్యాలయాలను తరలించడం మొదలు పెట్టింది. ఎట్టి పరిస్థితుల్లో అమరావతి నుంచి వెళ్లిపోవాలని నిర్ణయించుకున్న వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం అతి వేగంగా చర్యలు తీసుకుంటున్నది. ఇందులో భాగంగా విజిలెన్స్ కమిషనర్ కార్యాలయం, కమిషనరేట్ ఆఫ్ ఎంక్వైరీస్ ఛైర్మన్, కమిషనర్ ఆఫ్ ఎంక్వైరీస్ సభ్యుల కార్యాలయాలను కర్నూలుకు తరలిస్తూ రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం అర్ధరాత్రి ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం ఈ కార్యాలయాలు వెలగపూడిలోని సచివాలయం నుంచి పనిచేస్తున్నాయి.
పరిపాలనా కారణాల రీత్యా వీటిని కర్నూలుకు తరలిస్తున్నట్లు ప్రభుత్వం ఉత్తర్వులో పేర్కొంది. ఈ కార్యాలయాల ఏర్పాటుకు అనువైన భవనాలను గుర్తించాల్సిందిగా కర్నూలు జిల్లా కలెక్టర్, రోడ్లు భవనాల శాఖ ఇంజినీర్ ఇన్చీఫ్లను ఆదేశిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలంసాహ్ని ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం కర్నూలును న్యాయ రాజధానిగా ప్రతిపాదిస్తున్న నేపథ్యంలో ఈ కార్యాలయాలను తరలిస్తూ నిర్ణయం తీసుకున్నట్టుగా కనిపిస్తోంది.