సీనియర్ జర్నలిస్ట్ ముళ్ళపూడి సదాశివ శర్మ (62) శుక్రవారం ఉదయం హైదరాబాద్ లోని ఓ ప్రయివేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. ఆయనకు భార్య, ఒక కుమార్తె ఉన్నారు. గత వారం రోజులు గా జ్వరం తో బాధపడుతున్న ఆయనకు గుండె పోటు రావడంతో గత రాత్రి ఆస్పత్రిలో చేర్చారు. ఆ తర్వాత స్వల్ప వ్యవధిలో కోలుకుని మళ్లీ తెల్లవారు జామున గుండెపోటు రావడంతో ఆయన మరణించారు. సదాశివ శర్మ దాదాపు నాలుగు దశాబ్దాల పాటు జర్నలిజం వృత్తి లోనే కొనసాగారు.
హిందూస్థాన్ సమాచార్,ఎన్ ఎస్ ఎస్ వార్తా సంస్థ ల్లో కొంతకాలం విలేఖరి గా, ఆ తర్వాత ఈనాడులో చాలా కాలం ఉప సంపాదకుని గా, డెస్క్ ఇన్ చార్జిగా పని చేశారు. తర్వాత ఆంధ్ర భూమి లో న్యూస్ ఎడిటర్ గా పని చేశారు. ఎక్స్ ప్రెస్ గ్రూప్ ఆంధ్రప్రభ సండే డెస్క్ ఇన్ చార్జిగా పని చేశారు. కొద్దికాలం కృష్ణాపత్రికలో పని చేసిన తర్వాత హిందీ మిలాప్ లో న్యూస్ ఎడిటర్ గా పనిచేశారు.
కొత్త యాజమాన్యం వచ్చాక ఆంధ్రప్రభ సంపాదకునిగా పనిచేశారు. చివరిగా ఆంధ్ర భూమిలో ఎం.వి.ఆర్.శాస్త్రి తర్వాత ఏడాది పాటు సంపాదక బాధ్యతలు కూడా నిర్వహించారు. లాక్ డౌన్ పేరుతో ఆంధ్రభూమిని మూసివేయడంతో అప్పటి నుంచి ఖాళీగానే ఉంటున్నారు. సాక్షి జర్నలిజం స్కూల్ లో జర్నలిజంపై పాఠాలు కూడా చెప్పేవారు.
ఆరోగ్య సమస్యలు ఎదురైనా, ఉద్యోగ సంబంధ సంక్షోభాలు ఎదురైనా ఎల్లప్పుడూ చిరునవ్వుతో పలకరిస్తుండేవారు. యువ పాత్రికేయులను ప్రోత్సహిస్తుండేవారు. టిడిపి అధినేత చంద్రబాబునాయుడుకు హిందీ ప్రసంగాలు తయారు చేసి, వాటిని ప్రసంగించే విషయంలో సహకారం అందించారు. చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ ఏర్పాటు చేసిన సమయంలో ఆయనకు కూడా హిందీ భాష విషయంలో సహకారం అందించారు.
ప్రధాని నరేంద్ర మోడీ ‘మన్ కి బాత్’ కార్యక్రమాన్ని దూరదర్శన్ కోసం సదాశివశర్మ తెలుగులో చాలా కాలంపాటు అనువదించేవారు.
సీనియర్ పత్రికా సంపాదకులు, బహుభాషా కోవిదుడు, హిందీ, తెలుగు భాషలో నిష్ణాతుడు సదాశివ శర్మ మృతి పట్ల తెలంగాణ రాష్ట్ర మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ ప్రగాఢ సంతాపం ప్రకటించారు. సదాశివ శర్మ ఉత్తమ జర్నలిస్టుగా పేరొందారని నివాళులు అర్పించారు.