ఎన్జీటీలో ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి మరో ఎదురుదెబ్బ తగిలింది. ఏపీలో ఇసుక తవ్వకాలను నిలిపివేయాలని ఎన్జీటి విస్పష్ట తీర్పు ఇచ్చింది. “ఏపీలో 110 రీచ్లలో ఇసుక తవ్వకాలు పూర్తిగా నిలిపివేయాలని, తాజాగా పర్యావరణ అనుమతులు తీసుకునేంతవరకూ ఇసుక తవ్వకాలు చేపట్టరాదనీ రాష్ట్ర పర్యావరణ అంచనా కమిటీ(సియా) 110 రీచ్ లలో ఇసుక తవ్వకాలను నిలిపేయాలని ఇచ్చిన ఉత్తర్వులను వెంటనే అమలు చేయాలనీఎన్డీటీ స్పష్టం చేసింది. నాగేంద్రకుమార్ దాఖలు చేసిన పిటిషన్పై ఎన్జీటీ తీర్పు ఇచ్చింది.
సుప్రీంకోర్టు కూడా ఇసుక తవ్వకాలను నిలిపివేసి, తాజాగా పర్యావరణ అనుమతులు తీసుకున్న తర్వాతే ప్రారంభించాలని చెప్పిన విషయాన్ని కూడా తన తీర్పులో ఎన్జీటీ పేర్కొంది. గతంలో తాము ఇచ్చిన ఉత్తర్వులు అరణియార్ నదిలో ఉన్న 18 రీచ్లకు మాత్రమే పరిమితం కాదన్న ఎన్జీటీ ఆదేశాలను పట్టించుకోక పోవడమే కాకుండా ట్రిబ్యునల్ తీర్పుకు వక్రబాష్యం చెప్పిందని ఏపీ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. సియా స్టాప్ ఆర్డర్ ఇచ్చిన తర్వాత జరిగిన ఇసుక తవ్వకాలపై నివేదిక ఇవ్వాలని ఏపీ ప్రభుత్వానికి ఎన్జీటి ఆదేశాలు జారీ చేసింది. ఇసుక తవ్వకాలపై జెపి వెంచర్స్ కూడా పూర్తిస్థాయి నివేదిక ఇవ్వాలని ఎన్జీటీ ఆదేశాలు ఇచ్చింది.