కాంగ్రెస్ అగ్రనేత, ఇటీవల ఎంపీ సభ్యత్వం కోల్పోయిన రాహుల్ గాంధీపై మరో పరువు నష్టం కేసు నమోదైంది. భారత్ జోడో యాత్ర సందర్భంగా రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ కార్యకర్తలపై చేసిన వ్యాఖ్యలకు గానూ ఉత్తరాఖండ్లోని హరిద్వార్ కోర్టులో ఆర్ఎస్ఎస్ కార్యకర్త కమల్ బదౌరియా పరువునష్టం దావా వేశారు. భారత్ జోడో యాత్రలో భాగంగా జనవరి 9న హరియాణాలోని అంబాలా జిల్లాలో పర్యటించిన రాహుల్ గాంధీ ఆర్ఎస్ఎస్ కార్యకర్తలను కౌరవులతో పోల్చారని కమల్ బదౌరియా ఆరోపించారు. అంబాలాలో నిర్వహించిన సమావేశంలో రాహుల్ గాంధీ మాట్లాడుతూ… ఆర్ఎస్ఎస్ కార్యకర్తలంతా 21వ శతాబ్దపు కౌరవులని వ్యాఖ్యానించారు. ‘‘ కౌరవులు ఎవరు? మీకు 21వ శతాబ్దపు కౌరవుల గురించి చెబుతా వినండి. వాళ్లంతా ఖాకీ ప్యాంటులు వేసుకుంటారు. బూట్లు వేసుకొని, చేతిలో లాఠీ పట్టుకుంటారు. దేశంలోని ఇద్దరుముగ్గురు సంపన్నులు వారికి మద్దతుగా ఉంటారు.’’ అంటూ ఆర్ఎస్ఎస్ కార్యకర్తలను ఉద్దేశించి రాహుల్ వ్యాఖ్యానించారు. ఈ కేసుపై ఏప్రిల్ 12న హరిద్వార్ న్యాయస్థానం విచారణ చేపట్టనుంది.