ఉత్తరప్రదేశ్ లో మరో దళిత యువతిపై అత్యాచారం జరిగింది. హత్రాస్ కు చెందిన ఒక దళిత బాలికను కొందరు యువకులు సామూహికంగా అత్యాచారం చేసి ఆ పై చంపేసిన సంఘటన మరువక ముందే మరో దళిత యువతి అత్యాచారానికి గురి కావడం తీవ్ర ఆందోళన కలిగిస్తున్నది.
బలరామ్ పూర్ జిల్లా గయిసారి ప్రాంతంలో ఒక 22 ఏళ్ల దళిత యువతి అక్కడి ఒక ప్రయివేటు కర్మాగారంలో పని చేస్తున్నది. మంగళవారం రాత్రి ఆమె పని ముగించుకుని ఇంటికి రావాల్సి ఉండగా రాలేదు. దాంతో ఆమె ఆచూకీ కోసం ఆమె తల్లిదండ్రులు వెతుకులాట ప్రారంభించారు.
ఆమె మొబైల్ ఫోన్ నుంచి కూడా సమాధానం రాకపోవడంతో వారిలో ఆందోళన మరింత పెరిగింది. అయితే ఆ తర్వాత కొన్ని గంటలకు పూర్తిగా అచేతన స్థితిలో చేతికి సెలైన్ ఎక్కించే పట్టీతో ఒక రిక్షాలో ఆమె ఇంటికి వచ్చింది. దాంతో తక్షణమే ఆమెను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు.
అయితే తరలించే క్రమంలోనే ఆమె మరణించింది. ఆమె సామూహిక అత్యాచారానికి గురైనట్లు తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారని బలరామ్ పూర్ ఎస్ పి వర్మ తెలిపారు. ఈ ఘటనకు సంబంధించిన కేసు విచారించి తక్షణమే షహీద్, సాహిల్ అనే ఇద్దర్ని పోలీసులు అరెస్టు చేసినట్లు ఎస్ పి వెల్లడించారు.