పెళ్లి చేసుకుంటానని గర్భవతిని చేసి ఆ గర్భాన్ని తొలగించిన ప్రియుడి ఇంటి ముందు ప్రియురాలు ధర్నాకు దిగిన ఘటన కామారెడ్డి జిల్లా కామారెడ్డి మున్సిపాలిటీ పరిధిలోని అడ్లూర్ గ్రామంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే గ్రామానికి చెందిన పెరుమాండ్ల పవన్ శ్యామ్ రాయ్ అదే గ్రామానికి చెందిన అంకాడి సుప్రియ గత రెండు సంవత్సరాలుగా ప్రేమించుకుంటున్నారు.
నిజామాబాద్ లో చదువుకోవడానికి వెళ్తుండగా అమ్మాయి వెంట పడ్డాడు. రోజు వెళ్ళేటప్పుడు, వచ్చేటప్పుడు రైల్వే స్టేషన్లో కలిసేవాడు. ఇలా వారి మధ్య ప్రేమ చిగురించింది. పెళ్లి చేసుకుందాం అని శ్యామ్ రాయ్ అడగగా ఇప్పుడే వద్దని వరించింది. ఒకరోజు సుప్రియను బాసరకు తీసుకెళ్లిన శ్యామ్ రాయ్ అక్కడ అమ్మాయికి బొట్టు పెట్టి నిన్ను తప్ప ఇతరులను పెళ్లి చేసుకొనని మాట ఇచ్చాడు.
దాంతో ఇద్దరు శారీరకంగా ఒక్కటయ్యారు. ఈ నేపథ్యంలో అమ్మాయి గర్భం దాల్చింది. ఈ విషయాన్ని శ్యామ్ రాయ్ కి తెలుపగ ఏవో మందు గోళీలు తెచ్చి వేసాడు. దాంతో అమ్మాయికి గర్భస్రావం అయింది. కడుపునొప్పితో ఆస్పత్రిలో చేరి పిండాన్ని తొలగించుకున్నారు. ఈ విషయం అమ్మాయి తల్లిదండ్రులకు తెలిసి పెళ్లి చేసుకోవాలని అడగగా చేసుకుంటానని చెప్పారు.
కానీ శ్యామ్ రాయ్ తండ్రి రాజనర్సింలు ఒప్పుకోలేదు. రాజనర్సింలు టిఆర్ఎస్ పార్టీ ఎస్సి సెల్ మండల అధ్యక్షుడిగా మాల మహానాడు జిల్లా కన్వీనర్ గా పని చేస్తున్నాడు. కులం పెద్ద మనుషులు ఇద్దరికి పెళ్లి చేయాలని నర్సింలుకు చెప్పినా వినలేదు కదా ఏం చేసుకుంటారో చేసుకొండని తిరగబడ్డాడు. రాత్రి నుంచి సుప్రియ ప్రియుడి ఇంటివద్ద ఆందోళనకు దిగింది.
ఆమెకు కులం కూడా మద్దతు తెలుపగ రాజనర్సింలు కుటుంబ సభ్యులు ఇంటి నుంచి పారిపోయారు. ఇంత జరుగుతున్నా పోలీసులు మాత్రం ఈ వైపు రాకపోవడం విమర్శలకు తావిస్తోంది. మరోవైపు పోలీసులకు రాజనర్సింలు లంచం ఇచ్చి రాకుండా చేస్తున్నాడని బాధిత కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. తనకు న్యాయం జరిగే వరకు ఇక్కడి నుంచి జరిగేది లేదని ప్రియురాలు సుప్రియ స్పష్టం చేస్తోంది