తూర్పుగోదావరి జిల్లా దేవీపట్నం వద్ద ఇటీవల జరిగిన బోటు ప్రమాదంలో మరణించిన వ్యక్తి కుటుంబానికి తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన పరిహారాన్ని ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ నేడు అందచేశారు. ఈ సందర్భంగా వినయ్ భాస్కర్ మాట్లాడుతూ బోటు ప్రమాదం ఎన్నో కుటుంబాలలో విషాదాన్ని నింపిందని, బోటు ప్రమాదంలో మృతి చెందిన నిరుపేద కుటుంబాలకు పెద్ద మనసుతో తెలంగాణ సిఎం కేసీఆర్, ఏపి సిఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి పరిహారం ప్రకటించి ఆదుకున్నారని అన్నారు.
ఈ ప్రమాదంలో మరణించిన హేమంత్ కుటుంబానికి ఆర్థిక భరోసాను ఇచ్చేందుకు పదిహేను లక్షల రూపాయల చెక్కును హేమంత్ తల్లిదండ్రులు భూమయ్య పద్మావతిలకు అందించడం జరిగిందని ఆయన తెలిపారు. అదేవిధంగా అనారోగ్యంతో బాధపడుతూ ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న శాయంపేటకు నిరుపేద కుటుంబానికి చెందిన కాంతమ్మ, బుచ్చి రాములుకు సీఎం సహాయనిధి నుండి లక్షా యాభై వేల రూపాయల విలువ గల చెక్కులను కూడా అందచేశారు.
సుజిత్ నగర్ లో నివాసముంటున్న కోతుల వాళ్లకు అన్ని రకాలుగా అండగా నిలుస్తూ వారికి అతి త్వరలో శాయంపేట లో నిర్మించబోయే డబుల్ బెడ్ రూమ్ ఇండ్లలో వారికి అవకాశం కల్పిస్తామని ఈ సందర్భంగా దాస్యం వినయ్ భాస్కర్ తెలిపారు. సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో నిరుపేదలకు అత్యున్నత స్థానం కల్పించడంమే ముఖ్యమంత్రి కేసీఆర్ లక్ష్యం అని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ అరుణ శివశంకర్ ఆర్డిఓ వెంక రెడ్డి ఎమ్మార్వో నాగేశ్వరరావు ఇతర ప్రజాప్రతినిధులు నాయకులు పాల్గోన్నారు.