కామారెడ్డి మున్సిపాలిటీలో తాము పేరుకే పని చేస్తున్నామని, ఇక్కడ పని చూపించకపోవడంతో ఏడు నెలలుగా పార్కులో కూర్చుని వెళ్లిపోతున్నామని విఆర్ఏలు ఆవేదన వ్యక్తం చేశారు. గురువారం మున్సిపల్ సర్వసభ్య సమావేశం సందర్భంగా ఎమ్మెల్యేతో తమ బాధను చెప్పుకోవడానికి వచ్చిన విఆర్ఏలు అక్కడికి వచ్చిన మీడియాతో తమ సమస్యను చెప్పుకున్నారు. గత సవత్సరం ఆగస్ట్ నెలలో 54 మంది విఆర్ఏలను జిల్లాలోని కామారెడ్డి, ఎల్లారెడ్డి, బాన్సువాడ మున్సిపాలిటీలకు కేటాయించారన్నారు.
బాన్సువాడ, ఎల్లారెడ్డికి కలిపి 25 మంది, కామారెడ్డి మున్సిపాలిటీకి 25 మంది విఆర్ఏలను కేటాయించారని, ఎల్లారెడ్డి, బాన్సువాడ మున్సిపాలిటీలలో విఆర్ఏలకు వివిధ పనులు అప్పగించి వేతనాలు కూడా ఇస్తున్నారన్నారు. అయితే కామారెడ్డి మున్సిపాలిటీలో ఉన్న 25 మందికి ఇప్పటికి ఎలాంటి పని చెప్పడం లేదన్నారు. ఉదయం వచ్చి కమిషనర్ కు కలిసి వెళ్లి పార్కులో సాయంత్రం వరకు కూర్చుని వెళ్తున్నామని తెలిపారు. ఇప్పటికి తమకు ఎలాంటి ఎంప్లాయి ఐడి ఇవ్వలేదన్నారు. 7 నెలలుగా జీతాలు కూడా ఇవ్వడం లేదని, కుటుంబ పోషణ భారంగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు.
గత కమిషనర్ పట్టించుకోలేదని, ప్రస్తుత కమిషనర్ ఎంప్లాయ్ ఐడి ఇస్తామని చెప్పి ఇవ్వలేదన్నారు. ఈ విషయమై 7నెలలుగా కలెక్టర్ ను కలిసి విన్నవించినామని, సిసిఎల్ఏకు కూడా వెళ్లి వచ్చినా తమ సమస్య పరిష్కారం కావడం లేదని వాపోయారు. 25 మందిలో ముగ్గురు విఆర్ఏలు జుక్కల్ లాంటి సుదూర ప్రాంతం నుంచి వస్తున్నారన్నారు. తమ సమస్య పరిష్కరించాలని ఎమ్మెల్యే కాటిపల్లి వెంకట రమణారెడ్డిని కలిసి వినతిపత్రం అందజేశారు.
సత్యం న్యూస్, కామారెడ్డి