బాసర ట్రిపుల్ ఐటీలో వరుస ఆత్మహత్యలు కలకలం రేపుతున్నాయి. ట్రిపుల్ ఐటీలో పీయూసీ మొదటి సంవత్సరం చదువుతున్న దీపిక రెండు రోజుల క్రితం ఆత్మహత్య చేసుకున్న వార్త మరువక ముందే తాజాగా మరో విద్యార్థిని ప్రాణాలు తీసుకుంది. బూర లిఖిత అనే విద్యార్థిని గత అర్ధరాత్రి హాస్టల్ భవనంపై నుంచి దూకి బలవన్మరణానికి పాల్పడింది.
నాలుగో అంతస్తు నుంచి దూకడంతో లిఖిత అక్కడికక్కడే మృతి చెందింది. మృతురాలు పీయూసీ మొదటి సంవత్సరం చదువుతోంది. లిఖిత స్వస్థలం సిద్ధిపేట జిల్లా గజ్వేల్. విషయం తెలిసిన ట్రిపుల్ ఐటీ సిబ్బంది లిఖిత మృతదేహాన్ని జిల్లా ఆసుపత్రికి తరలించి తల్లిదండ్రులకు సమాచారం అందించారు.
దీంతో తల్లిదండ్రులు హుటాహుటిన ఆస్పత్రికి చేరుకుని విగతజీవిగా పడి ఉన్న తమ కూతురిని చూసి కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. మరోవైపు వరుస ఆత్మహత్యల నేపథ్యంలో ఆసుపత్రి వద్ద పోలీసులు భారీ బందోబస్త్ ఏర్పాటు చేశారు. మీడియా సహా ఎవరినీ కూడా లోపలికి అనుమతించేందుకు నిరాకరిస్తున్నారు. అయితే మొన్న దీపిక..
ఇప్పుడు లిఖిత ఆత్మహత్యలతో అసలు క్యాంపెస్లో ఏం జరుగుతుందో అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ట్రిపుల్ ఐటీలో విద్యార్థినిల ఆత్మహత్యలు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ట్రిపుల్ ఐటీ విద్యార్థిని లిఖిత మృతిపై వీసీ వెంకటరమణ స్పందించారు. లిఖిత ప్రమాదవశాత్తు చనిపోయినట్టు భావిస్తున్నామన్నారు.
ఫోన్ చూస్తూ భవనంపై నుంచి జారి పడిందని.. ప్రమాదంలో ఆమె వెన్ను భాగం దెబ్బతిన్నదని తెలిపారు. విద్యార్థుల మరణం బాధాకరమని వీసి వెంకటరమణ అన్నారు. మరోవైపు జిల్లా ఆసుపత్రి కి చేరుకున్న ట్రిపుల్ ఐటీ వీసీ విద్యార్థిని లిఖిత మృతదేహాన్ని పరిశీలించారు. అయితే ఆస్పత్రికి వచ్చిన వీసీని లిఖిత కుటుంబసభ్యులు నిలదీశారు.
మీ నిర్లక్ష్యం వల్లనే పిల్లలు చనిపోతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.జిల్లా ఆసుపత్రి వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. విద్యార్థిని మృతదేహాన్ని పరిశీలించేందుకు ఆస్పత్రికి వచ్చిన వీసి వెంకటరమణను కాంగ్రెస్ నేతలు ఘెరావ్ చేశారు.
వీసీతో వాగ్వాదానికి దిగుతూ.. వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో వీసీ వెంకటరమణ కాసేపటికే ఆస్పత్రి నుంచి వెళ్లిపోయారు.