నాణ్యమైన విత్తనాలు, ఎరువులు సకాలంలో రైతులకు సబ్సిడీపై అందించాలని, రుణమాఫీ, బ్యాంకు రుణాలు, పంట నష్టపరిహారం తక్షణమే అమలు చేయాలని అఖిల భారత రైతు కూలీ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు జడ సత్యనారాయణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
ఏఐకేఎంఎస్ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు గార్ల తహసిల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ధర్నా నుద్దేశించి ఆయన మాట్లాడుతూ వ్యవసాయ సీజన్ ప్రారంభమైందని రైతులకు అవసరమైన విత్తనాలు అందించాల్సిన పాలకులు నుండి ఇంతవరకు ఉలుకు పలుకు లేదని, మరోవైపు నకిలీ విత్తనాలు మార్కెట్లోకి రైతులకి చేరుతున్నాయన్నారు.
కల్తీ ఎరువులు దుకాణదారులు అమ్ముతున్నారని దీనిపై వ్యవసాయ అధికారులు ప్రభుత్వ పట్టింపు లేదని ఆరోపించారు. ప్రతి సంవత్సరం పురుగుల మందుల కంపెనీలు పుట్టగొడుగుల్లాగా పుట్టుకొస్తున్నాయన్నారు.
ప్రభుత్వం రైతులకు లక్ష రూపాయల రుణాన్ని మాఫీ, రైతాంగానికి అవసరమైన అన్ని రకాల నాణ్యమైన విత్తనాలను 70 శాతం సబ్సిడీపై ప్రభుత్వమే సరఫరా చేయాలని, నకిలీ విత్తనాలను అరికట్టాలి, రైతులకు అవసరమైన ఎరువులను సబ్సిడీపై ముందుగానే అందించాలని సత్య నారాయణ డిమాండ్ చేశారు.
అనంతరం ఇన్చార్జి తహశీల్దార్ వీరన్న కు వినతి పత్రాన్ని అందించారు. ఈ కార్యక్రమంలో మద్ది వంచ గ్రామ పంచాయతీ సర్పంచ్ కుసిని బాబు రావు, సంఘం నాయకులు నాదెండ్ల శ్రీనివాస్, పాక వెంకన్న, గురవయ్య, మల్లేష్, పెంటయ్య, వెంకట నరసయ్య, తదితరులు పాల్గొన్నారు.