పౌరసత్వ చట్టాలకు వ్యతిరేకంగా జరుగుతున్న పోరాటంలో ఇక దళితులు ప్రధాన పాత్ర పోషిస్తారని మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు అద్దంకి దయాకర్ అన్నారు. ఇది ముస్లింల సమస్య మాత్రమే కాదని ఆయన అన్నారు. ఇది చూడటానికి ముందు ముస్లింల సమస్య అనిపిస్తుంది కానీ దీని తర్వాత కత్తి వేలాడే ది క్రైస్తవులపైన, ఆ తర్వాత కచ్చితంగా దళితులపైన అని ఆయన అన్నారు.
దేశానికి స్వాతంత్రం వచ్చిన తరువాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగానికి విరుద్ధంగా ఈ దేశంలో మనుధర్మ శాస్త్రాన్ని అమలు చేసేందుకు ప్రయత్నిస్తున్నారని ఆయన అన్నారు. ఈ విషయాన్ని దళితులు, క్రైస్తవులు గ్రహించారని అందువల్లే ఈ నల్ల చట్టాల ఉద్యమం ముస్లిం సమాజానికి మాత్రమే పరిమితం కాదని మిగిలిన వారు కూడా పోరాటం జరపాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో సైతం దళితులు, ముస్లింలు బహుజనులు ఐక్యతగా ఒక వేదిక పైకి వచ్చి రాబోయే రోజుల్లో పోరాటం కొనసాగిస్తారని లంబాడ హక్కుల పరిరక్షణ సమితి జాతీయ అధ్యక్షులు బెల్లయ్య నాయక్ అభిప్రాయపడ్డారు. బ్రాహ్మణ ఆలోచనపరుల వేదిక కన్వీనర్ మల్లాది పవన్ మాట్లాడుతూ కేంద్రంలో భారతీయ జనతా పార్టీ పూర్తిగా ఆర్.ఎస్.ఎస్ లో నడుస్తుంది కాబట్టి ఇది మతోన్మాదాన్ని ప్రేరేపిస్తుంది తప్ప మానవతా వాదాన్ని ప్రేరేపించదని అన్నారు. వాస్తవానికి హిందూ ధర్మం ఇతర మతాలను కించపరచడం గాని వారిని చిన్నచూపు చూడడం గానీ చెయ్యదని ఆయన తెలిపారు.